YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు అని, ఈ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ యే చేశారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. వైసీపీ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచార సభలో విమర్శించారనీ, మరి అయిదేళ్లుగా వైసీపీ సర్కార్ పై బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని షర్మిల ప్రశ్నించారు.
కడపలో సోమవారం ఇండియా కూటమి లోక్ సభ అభ్యర్ధి వైఎస్ షర్మిల ను సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కే రామకృష్ణ, వి శ్రీనివాసరావులు కలిసి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైఎస్ షర్మిల మాట్లాడుతూ .. బీజేపీతో చంద్రబాబు బహిరంగంగా పొత్తు పెట్టుకుంటే .. గత అయిదేళ్లుగా జగన్ అక్రమ పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. కేవలం బీజేపీకి తొత్తుగా ఉన్నారన్న కారణంగానే జగన్మోహనరెడ్డిపై కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. రాజశేఖరరెడ్డి వారసుడుగా కంటే మోడీ దత్త పుత్రుడుగానే జగన్ ఎక్కువగా వ్యవహరించారని అన్నారు.
ముస్లింలకు ఉన్న నాలుగు శాతం రిజర్వేషన్లు తొలగిస్తామని బీజేపీ బహిరంగంగా చెబుతున్నా టీడీపీ, వైసీపీ నేతలు ఎలా మద్దతు తెలుపుతున్నారని షర్మిల ప్రశ్నించారు. గత అయిదు సంవత్సరాలుగా అనేక బిల్లుల విషయంలో వైసీపీ మద్దతు ఇచ్చిందని అన్నారు. బీజేపీకి అనుకూలురైన పారిశ్రామిక దిగ్గజాలు అదానీ, అంబానీలకు వైసీపీ గంగవరం పోర్టును కట్టబెట్టారని మండిపడ్డారు. రాష్ట్ర విభజన జరిగిన పదేళ్లు అవుతున్నా రాష్ట్టానికి ఇచ్చిన హామీల్లో బీజేపీ ఒక్కటైనా అమలు చేసిందా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి మంచి చేయాలన్న చిత్తశుద్ది బీజేపీకి ఉంటే ఎవరు అడ్డుపడ్డారని అడిగారు. బీజేపీ ప్రభుత్వాన్ని ఎదిరించగల సామర్థ్యం ఇండియా కూటమికి మాత్రమే ఉందని అన్నారు. రానున్న ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్ధులను గెలిపించాలని కోరారు.
వివేకా హత్య కేసుపైనా మాట్లాడుతూ.. జగన్ అధికారంలో లేనప్పుడు సీబీఐ విచారణ కావాలని అడిగారని అధికారంలోకి రాగానే ఎందుకు వద్దన్నారో సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. జగన్ చూసుకునే తెలంగాణ నేత రాఘవరెడ్డి తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. వెయ్యి కోట్లు తీసుకున్నట్లు రుజువులు చూపితే రాజకీయాల నుండి తప్పుకుంటానని సవాల్ చేశారు. తన తండ్రి వైఎస్ఆర్ పేరు సీబీఐ చార్జిషీట్ లో పెట్టించిన వారికి జగన్ ఏఏజీ పదవి ఇచ్చారని పునరుద్ఘాటించారు. కడప ఎంపీ అవినాష్ చేసిన వ్యాఖ్యలపైనా షర్మిల స్పందించారు. తన భర్త అనిల్ కుమార్ బీజేపీ నేతలను ఎక్కడా కలవలేదని, కలవరని స్పష్టం చేశారు. అవినాష్ మాదిరిగా అర్ధరాత్రి గొడ్డలి రాజకీయాలు తమకు తెలియవని ఆన్నారు.
PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ