PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తోనే వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యమని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ కూటమి అభ్యర్ధుల విజయాన్ని కాంక్షిస్తూ ఏపీలో పర్యటించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మోడీ పాల్గొన్నారు. అనంతరం అనకాపల్లిలో జరిగిన సభలో మోడీ పాల్గొన్నారు.
రాజమహేంద్రవరం బహిరంగ సభలో మోడీ తో పాటు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తదితరులు పాల్గొని ప్రసంగించగా, అనకాపల్లి సభలో మోడీతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన నేత నాగబాబు, అనకాపల్లి లోక్ సభ అభ్యర్ధి సీఎం రమేష్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.
ఈ సభల్లో ప్రధాని మోడీ ఏపీలోని వైసీపీ సర్కార్ పై విమర్శల దాడి చేశారు. వైసీపీ పాలన అంతా అవినీతి మయంగా మారిందని మోడీ విమర్శించారు. ఏపీలో మాఫియా రాజ్యం నడుస్తొందని అన్నారు. ఏపీలో మద్య నిషేదం పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన వైసీపీ .. అధికారంలోకి వచ్చాక మద్యం సిండికేట్ గా తయారయ్యారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో అవినీతి జెట్ స్పీడ్ తో పరిగెత్తిందని అన్నారు.
ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తుంది మద్యం మాఫియా, ఇసుక మాఫియా అని విమర్శించారు. చంద్రబాబు పాలనలో ఏపీ అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిందని అన్నారు. ఇప్పుడు వైసీపీ సర్కార్ అభివృద్ధిని నాశనం చేసిందని అన్నారు. మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వంలో అభివృద్ధి పరుగులు పెట్టిస్తామని అన్నారు. మూడు రాజధానులు చేస్తామని చెప్పి ఒక్కటీ చేయలేదని విమర్శించారు. మూడు రాజధానుల పేరిట ఏపీని లూటి చేశారని అన్నారు.
వైసీపీకి అవినీతి నిర్వహణ తప్ప రాష్ట్ర అర్ధిక నియంత్రణ తెలియదని విమర్శించారు. రాష్ట్ర ఖజానాను వైసీపీ ప్రభుత్వం ఖాళీ చేసిందని అన్నారు. జూన్ 4 ఆంధ్రప్రదేశ్, ఢిల్లీలో ఎన్డీఏ ప్రభుత్వం జెండా రెపరెపలాడుతుందన్నారు. అభివృద్ధి చెందుతున్న భారత్ నినాదంతో జరుగుతున్న ఎన్నికలు ఇప్పుడు జరుగుతున్నాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ వికాసం కోసం కేంద్ర ప్రభుత్వం పని చేస్తుందని మోడీ తెలిపారు.
వైసీపీ ప్రభుత్వం నిర్వాకం కారణంగా ఏపీలో అనేక చక్కెర పరిశ్రమలు మూత పడ్డాయని మోడీ విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ విధానాలతో చెరుకు రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. మత్స్యకారుల కోసం ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ఏపీ కోసం కేంద్రం అనేక కార్యక్రమాలు చేపట్టిందని, కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం ఏమీ చేయడం లేదని మోడీ విమర్శించారు. విశాఖ రైల్వే జోన్ ఆఫీస్ కి వైసీపీ ప్రభుత్వం భూమి కూడా ఇవ్వలేదని అన్నారు.
పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్రం రూ.15వేల కోట్లు ఇవ్వడం జరిగిందనీ, కానీ ఆ ప్రాజెక్టును ఈ ప్రభుత్వం పూర్తిగా నిలిపివేసిందని మోడీ విమర్శించారు. రైతుల ఆశలపై వైసీపీ సర్కార్ నీళ్లు చల్లిందన్నారు. ఢిల్లీ – ముంబాయి కారిడార్ మాదిరిగా విశాఖ – చెన్నై కారిడార్ నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. విశాఖ – చెన్నై కారిడార్ తో కాకినాడ పోర్టుకు సరుకు రవాణా సులభతరం అవుతుందన్నారు. చెన్నై – కోల్ కతా హైవే రాజమహేంద్రవరం విమానాశ్రయం ఈ ప్రాంత ముఖ చిత్రాన్ని మారుస్తాయన్నారు. ఈ ప్రభుత్వంలో అబివృద్ధి సున్నా .. అవినీతి వంద శాతం అంటూ మోడీ కామెంట్స్ చేశారు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీని పూర్తిగా తిరస్కరిస్తారని అన్నారు. రాష్ట్రమైనా, దేశమైనా అభివృద్ధి చెందాలంటే ఎన్డీఏ ప్రభుత్వం ఉండాలన్నారు.
ఏపీ ప్రతిభావంతైన యువతకు నెలవు అని మోడీ అన్నారు. టెక్నాలజీ లో ఏపీ యువత శక్తిని ప్రపంచం గుర్తించిందని అన్నారు. దేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో రాష్ట్రం కూడా అంతే స్పీడ్ తో అభివృద్ధి చెందాలన్నారు. కానీ కేంద్ర ప్రాజెక్టుల అమలును రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు పూర్తి అప్రమత్తంగా ఉండాలన్నారు.
పదేళ్ల క్రితం దేశాన్ని కాంగ్రెస్ పార్టీ అధోగతి పాలు చేసిందని అన్నారు. ఈడీ..ఈడీ అంటూ ఇండియా కూటమి గగ్గోలు పెడుతోందని, కాంగ్రెస్ నేతల వద్ద గుట్టల కొద్దీ డబ్బు బయటపడుతోందని, ఆ పార్టీల నేతల డబ్బును మెషిన్లు కూడా లెక్కపెట్టలేకపోతున్నాయి అన్నారు. ఏపీకి మోడీ గ్యారెంటీ, చంద్రబాబు నేతృత్వం, పవన్ విశ్వాసం ఉన్నాయన్నారు. ప్రపంచంలో అయిదో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా భారత్ ఎదిగిందని ప్రధాని చెప్పారు. కూటమి అభ్యర్ధులందరినీ భారీ మెజార్టీతో గెలిపించాలని మోడీ కోరారు.
BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్