ఏపీలో సామాజిక వర్గాలు చాలా సున్నితమైన అంశాలుగా మారాయి. దేశంలో మతం, కులం అనే అంశాల పట్ల రాజకీయం చేయాలంటే చాలా ధైర్యం కావాలి. అయితే బీజేపీ వంటి పార్టీ మత పరమైన రాజకీయాలు చేస్తూ నెట్టుకొస్తుండగా ఏపీలో వైసీపీ, టీడీపీ రెండు కూడా కుల పరంగా రాజకీయాలు చేస్తూ బాగానే లాక్కొస్తున్నాయి. అయితే ఒ సామాజిక వర్గానికి ఖచ్చితంగా రిజర్వేషన్ అమలు చేస్తాం వంటి సున్నితమైన హామీలు ఇచ్చి వాటిని అమలు చేయలేక చెడ్డపేరు తెచ్చుకోవడం ఏపీలో సీనియర్ నాయకుడుగా ఉన్న చంద్రబాబుకు పరిపాటిగా మారింది. కాపుల రిజర్వేషన్ అంశంలో తాజాగా ఇదే జరిగింది.
కాపు రిజర్వేషన్ల అంశం చాలా సున్నితమైంది. ఆచరణ సాధ్యం కానీ అలాంటి హామీని ఇచ్చి మళ్లీ అభాసుపాలు అవ్వడం కంటే ఆ అంశం జోలికి వెల్లకుండా ఉండటమే మంచిది అన్న అభిప్రాయంతో టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నారట. కాపు రిజర్వేషన్ అనే మాటలను కూడా మాట్లాడకూడదని ఆయన డిసైడ్ అయ్యారని టాక్. పార్టీ కూడా ఆ విషయం గురించి మాట్లాడవద్దని చంద్రబాబు సూచించినట్లు తెలియవస్తున్నది. దీనితో చంద్రబాబు మరో యు టర్న్ తీసుకున్నట్లు అవుతోంది. విషయంలోకి వస్తే….
రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలన్నా కాపు సామాజిక వర్గ ఓట్లు చాలా కీలకం. రాజకీయ పార్టీల గెలుపు ఓటములను ప్రభావితం చేసేంత స్థాయిలో కాపు సామాజికవర్గ ఓట్లు ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని టిడిపి అధినేత చంద్రబాబు 2014 ఎన్నికలకు ముందు నిర్వహించిన పాదయాత్రలో కాపు సామాజిక వర్గీయులను ప్రసన్నం చేసుుకునేందుకు అనేక హామీలను ఇచ్చారు. అందులో ప్రధానంగా కాపులకు రిజర్వేషన్ కల్పించడం. దానితో పాటు అధికారం చేజిక్కించుకోవాలన్న ఏకైక లక్ష్యంతో అనేక ఆచరణ సాధ్యం కానిీ హామీలనూ ఇచ్చారు. అన్ని వర్గాలతో పాటు కాపు సామాజిక వర్గీయులు చంద్రబాబు హామీలను విశ్వసించి టిడిపి అధికారంలోకి వస్తే తమ ఆశలు నెరవేరుతాయని టిడిపికి కాపు కాశారు. పర్యవసానంగా 2014 ఎన్నికల్లో టిడిపి గెలిచింది, చంద్రబాబు సిఎం అయ్యారు. అధికారంలోకి వచ్చిన తరువాత కాపు సామాజిక వర్గానికి ఇచ్చిన రిజర్వేషన్ హామీని చంద్రబాబు నెరవేర్చలేకపోయారు. ఆయన ఇచ్చిన హామీ నిధులను కేటాయించలేదు. దీంతో మెజారిటీ కాపు సామాజిక వర్గీయులు చంద్రబాబుకు కటీఫ్ చెప్పారు.
2014 ఎన్నికల్లో చంద్రబాబుకు మద్దతు తెలిపిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా 2019 ఎన్నికల నాటికి టిడిపికి దూరం అయ్యారు. బి ఎస్ పి, వామపక్షాల కూటమితో జనసేన ఎన్నికల బరిలో నిలిచింది. ఈ ఎన్నికల్లో జనసేన అంతగా ప్రభావం చూపకపోయినా మెజార్టీ కాపు సామాజిక వర్గీయులు వైసిపిికి కాపు కాయడం టిడిపి ఓటమికి ఒక కారణంగా విశ్లేషణలు చెబుతున్నాయి. ఎన్నికల్లో ఓటమి తరువాత చంద్రబాబుకు తత్వం బోధపడిందని అందుకే ఆచరణ సాధ్యం కానీ రిజర్వేషన్ లాంటి హామీ మరొక సారి ఇవ్వకూడదు అనుకుంటున్నారుట.