జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చివరి అంకానికి తెర లేచింది. ఈరోజు ఉదయం కౌంటింగ్ మొదలైంది. ప్రధాన పోటీ టీఆర్ఎస్ – బీజేపీ మధ్యే ఉంది. ఏమూలో భయంతో టీఆర్ఎస్, గెలుస్తామన్న ధీమాతో బీజేపీ, తమ వర్గం ఓట్ల మీదే నమ్మకంతో ఎంఐఎం, ఉనికి కాపాడుకుంటే చాలని కాంగ్రెస్, టీడీపీ.. పార్టీలు ఉన్నాయి. తగ్గిన ఓటింగ్ కూడా ఫలితాలపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ క్రమంలో 2016లో ఎన్నికలకు 2020 ఎన్నికలకు వ్యత్యాసం కనిపిస్తోంది. అప్పుడూ, ఇప్పుడూ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీనే అధికారంలో ఉంది. అప్పట్లో టీఆర్ఎస్ కు ఎదురు లేదు. కానీ.. ఇప్పుడు అన్నీ ప్రతికూల అంశాలే. అప్పటికీ ఇప్పటికీ ఓట్లలో, శాతాల్లో ఉన్న తేడాను పరిశీలిస్తే..
2016లో.. అలా
2016లో.. 150 డివిజన్లలో మొత్తం 33,49,379 ఓట్లు పోలయ్యాయి. ఓట్లు, శాతంలో చూస్తే.. 2016లో టీఆర్ఎస్ కు 14,68,618 ఓట్లు రాగా 43.85 శాతంగా నమోదైంది. బీజేపీకి 3,46,253 ఓట్లు, 1.34శాతం నమోదైంది. కాంగ్రెస్ కు 3,48,388 ఓట్లు, 10.40 శాతం నమోదైంది. ఎంఐఎంకు 5,30,812 ఓట్లు రాగా 15.85 శాతంగా నమోదైంది. బీఎస్పీకి 10,478 ఓట్లు, సీపీఐకు 12,748 ఓట్లు, సీపీఐ(ఎం) కు 1921, లోక్ సత్తాకు 115 ఓట్లు వచ్చాయి. మొత్తంగా 2016లో టీఆర్ఎస్ 99, ఎంఐఎం 44, బీజేపీ 4, కాంగ్రెస్ 2, టీడీపీ 1 సీట్లు గెలుచుకున్నాయి. టీఆర్ఎస్ ఏకచత్రాధిపత్యంతో మేయర్ పీఠం దక్కించుకుంది. అయితే..
2020లో ఇలా..
2020లో.. పరిస్థితికి భిన్నంగా ఇప్పుడు టీఆర్ఎస్ కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. రాష్ట్రం ఏర్పడిన కొత్త, టీఆర్ఎస్ ఊపు 2016 బల్దియాలో కూడా కొనసాగింది. కానీ.. ప్రభుత్వ నిరంకుశవాదం, చెప్పినవి చేయకపోవడం, అభివృద్ధి లేకపోవడం, నాయకుల తీరు టీఆర్ఎస్ కు శాపాలయ్యాయి. నిజామాబాద్ ఎంపీ, దుబ్బాక ఉప ఎన్నిక ఓటములే ఇందుకు ఉదాహరణ. ఇంటర్మీడియల్ విద్యార్ధుల ఆత్మహత్యలు, ఆర్టీసీ సమ్మెపై నిర్లక్ష్యం, ఇటివలి వరదల్లో అలసత్వం.. జీహెచ్ఎంసీలో ప్రతిబంధకాలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓటింగ్ పర్సెంట్ తగ్గడమే ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా నిలుస్తోంది.
పార్టీల పరిస్థితి..
బీజేపీ.. హైదరాబాద్ లో కాస్త బలం ఉన్న పార్టీ ఇప్పుడు రాష్ట్రం మొత్తం తన ఉనికిని చాటుకుంటోంది. టీఆర్ఎస్ కు ఎంపీ, ఉప ఎన్నికల్లో ఓటమి రుచి చూపించింది బీజేపీనే. కాంగ్రెస్ ను బలహీనం చేసిన కేసీఆర్ కు ఏకులా ఉండే బీజేపీ మేకులా తయారైంది. ప్రభుత్వ వైఫల్యాలను బలాలుగా మార్చుకుంది. ఇదే సరైన సమయం అంటూ పోరాడుతోంది. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు సొంత పార్టీ నాయకులే మొహం చాటేశారు. పార్టీ ఫిరాయింపులు నాయకత్వ లేమి కాంగ్రెస్ కు నష్టం చేకూర్చాయి. కార్యకర్తల బలం ఉంది, ఓటర్లున్నారని చెప్పుకునే టీడీపీకి ఓటేసేవారే కరువయ్యారు. పార్టీ కార్యాలయం తప్ప టీడీపీకి హైదరాబాద్ లో మిగిలేందేమీ లేదు. తెలంగాణలో బీజేపీ బలం ఏంటో, టీఆర్ఎస్ పరిస్థితేంటో మరికొన్ని గంటల్లో తేలనుంది.