MP Kesineni Nani: రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టింది, ఇక పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భావిస్తూ అందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుండగా రోజుకు ఒక బ్యాడ్ న్యూస్ ఆయనకు చేరుతోంది. గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి హనుమంతరావు పార్టీకి గుడ్ బై చెప్పి 24 గంటలు అయ్యిందో లేదో మరో సిట్టింగ్ ఎంపి రాజకీయాల నుండి తప్పుకుంటున్నానని పేర్కొని షాక్ ఇచ్చారు. దీంతో రాబోయే ఎన్నికల నాటికి మరో నేతను సన్నద్దం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
విషయంలోకి వెళితే.. విజయవాడ ఎంపి కేశినేని నాని రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని చంద్రబాబుకు కూడా చెప్పారట. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్యాన్ గాలిలోనూ విజయవాడ నుండి కేశినేని నాని రెండవ సారి ఎంపీగా గెలిచారు. అయితే రెండవ సారి ఎంపిగా గెలిచినా పార్టీ అధికారానికి దూరం కావడంతో కొంత కాలం సైలెంట్ గా ఉండిపోయారు. దీంతో ఇతర నాయకుల మాదిరిగా కేశినేని నాని కూడా బీజేపీకి జంప్ చేస్తారని వార్తలు వచ్చినా వాటిని ఆయన ఖండించారు. ఇటీవల జరిగిన మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో ఆయన కుమార్తె కేశినేని శ్వేత ను మేయర్ చేయాలన్న ఆకాంక్షతో బరిలో దింపారు. ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల గెలుపునకు నాని శత విధాలుగా ప్రయత్నించారు. అయితే కార్పోరేటర్ గా ఆయన కుమార్తె అయితే నెగ్గింది కానీ గానీ మేయర్ అయ్యే ఛాన్స్ దగ్గలేదు. మెజార్టీ స్థానాలు వైసీపీ కైవశం చేసుకోవడంతో నాని ఆశలు ఫలించలేదు. ఆ తరువాత నాని కుమార్తె టాటా ట్రస్ట్ లో చేరిపోగా, నాని కూడా విజయవాడ నగరానికి, పాలిటిక్స్ కు దూరంగా ఉండిపోయారు.
కేశినేని నాని పార్టీకి దూరంగా ఉండటం విజయవాడ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. ఇదే విషయంపై పలువురు మీడియా ప్రతినిధులు కేశినేనిని సంప్రదించగా రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని పార్టీ అధినేత చంద్రబాబుకు కూడా చెప్పినట్లు సమాచారం. రాబోయే ఎన్నికలకు విజయవాడకు అభ్యర్థిని చూసుకోమని కూడా చెప్పారట. ప్రస్తుతం కేశినేని సిమ్లాలో ఉన్నారు. ప్రస్తుతం విజయవాడ పార్లమెంటరీ పార్టీ టీడీపీ నేతగా మాజీ మంత్రి నెట్టెం రఘురాం ఉన్నారు. కేశినేని రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో నెట్టెం రఘురాంను తదుపరి అభ్యర్ధిగా చంద్రబాబు ప్రకటిస్తారా లేక మరో పారిశ్రామిక వేత్త కోసం ప్రయత్నిస్తారా అనేది వేచి చూడాలి.