AP CM YS Jagan: రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు, రాజకీయ పార్టీల నేతలు ఓ మంచి సన్నివేశాన్ని మిస్ అయ్యారు. ఢిల్లీలో రేపు జరగనున్న ఓ సమావేశంలో ఆసక్తికరమైన సన్నివేశాలు ఆవిష్కృతం అవుతాయని అందరూ భావించారు. కానీ ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి డిల్లీ పర్యటనను రద్దు చేసుకోవడంతో ఆ సీన్ మిస్ అవుతున్నారు. ఇంతకూ విషయం ఏమిటంటే.. సార్వత్రిక ఎన్నికలకు ముందు నుండి గురు శిష్యుల బందంగా ఎంతో ఆప్యాయంగా ఉన్న తెలంగాణ, ఏపి ముఖ్యమంత్రులు కేసిఆర్, వైఎస్ జగన్ లు గత కొన్ని నెలలుగా ఎడ మోహం, పెడ మోహం గా ఉంటున్నారు. ముఖ్యమంత్రిగా జగన్మోహనరెడ్డి ప్రమాణ స్వీకారానికి కేసిఆర్ హజరైయ్యారు. తెలంగాణలో జరిగిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి అతిధిగా జగన్మోహనరెడ్డి వెళ్లారు. కేసిఆర్ నివాసంలో విందుకు జగన్ హజరైయ్యారు. విభజన సమస్యలు అనేకం పెండింగ్ లో ఉన్నా కేసిఆర్ కోరిన వెంటనే హైదరాబాద్ లో ఏపి ప్రభుత్వ ఆధీనంలోని భవనాలను జగన్ ఎటువంటి షరతులు లేకుండానే అప్పగించేశారు. ఇలా ఉన్న వారు ఒక్క సారిగా శతృవులుగా ఎలా అయిపోయారు అనేది చాలా మందికి అంతుబట్టడం లేదు.
ఆంధ్రా ప్రాజెక్టులపై తెలంగాణ సర్కార్. తెలంగాణలోని ప్రాజెక్టులపై ఏపి ప్రభుత్వం కేంద్రానికి, బోర్డులకు ఫిర్యాదు చేసుకోవడం తెలిసిందే. కేసిఆర్ – జగన్ ల మధ్య విబేధాలు ఏమీ లేవనీ, ఇదంతా ఓ డ్రామా అని కూడా అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష పార్టీల నాయకులు విమర్శిస్తున్నారు అనుకోండి. అది వేరే విషయం. ఆదివారం ఢిల్లీలో హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల ముఖ్యమంత్రుల సమావేశంలో కేసిఆర్, జగన్ లు పాల్గొంటారని అందరూ అనుకున్నారు. అందుకు షెడ్యుల్ కూడా ఖరారు అయ్యింది. అయితే తెలుగు రాష్ట్రాల జల జగడం పంచాయతీ తరువాత చాలా రోజులకు వీరు ఇద్దరు ఎదురెదురు పడిన సందర్భంలో ఇంతకు ముందు మాదిరిగా మాట్లాడుకుంటారా? లేదా ముభావంగా ఎవరి పని వారు చూసుకుని వెళ్లిపోతారా? అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఈ తరుణంలో జగన్ పర్యటన రద్దు కావడం ఆ పరిణామాలను గమనిద్దామనుకున్న వారు నిరుత్సాహానికి గురైయ్యారు. ఆ సమావేశంలో పాల్గొనేందుకు ప్రత్యేక విమానంలో తెలంగాణ సీఎం కేసిఆర్ హస్తినకు శుక్రవారం రాత్రి చేరిపోగా జగన్ పర్యటన చివరి నిమిషంలో రద్దు అయ్యింది. ఏపి సీఎం జగన్ శుక్రవారం ఉదయం వ్యాయామం చేస్తున్న సమయంలో కాలు బెణకింది. సాయంత్రానికి కూడా నొప్పి తగ్గకపోవడంతో వైద్యులు పరీక్షించి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో జగన్ డిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు. జగన్ కు బదులుగా రాష్ట్ర ప్రభుత్వం తరపున హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత ఢిల్లీ వెళుతున్నారు. ఆమెతో పాటు ఏపి డీజీపీ గౌతమ్ సవాంగ్ హజరవుతారు.