ఢిల్లీ: సుప్రీం కోర్టు చురకలంటించటంతో ఎన్నికల సంఘం ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్, బిఎస్పి అధినేత్రి మాయావతిపై చర్యలకు ఉపక్రమించింది.
రేపు ఉదయం ఆరు గంటల నుండి 48 గంటల పాటు మాయావతి ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. అలాగే యోగి ఆదిత్యానాథ్కు 72 గంటల నిషేధం విధించింది.
ఎన్నికల ప్రచారంలో కుల, మతాలను వినియోగిస్తూ ఓట్లు అభ్యర్ధిస్తున్న రాజకీయ పార్టీలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సోమవారం రంజన్ గోగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. విచారణ సందర్భంగా ఎన్నికల సంఘం తీరుపై రంజన్ గోగోయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఎన్నికల నియమావళిని కచ్చితంగా అమలు చేసే విషయంలో అధికారుల సేవలను వినియోగించుకోవడంలో ఎన్నికల సంఘం విఫలమవుతున్నట్లు కనిపిస్తోందంటూ రంజన్ గోగోయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో ఎన్నికల సంఘం యోగి ఆదిత్యానాథ్, మాయావతిపై చర్యలు తీసుకున్నది.