AP Assembly: ఏపీ శాసనసభ సమావేశాల మొదటి రోజే తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారనీ, ఆ అంశంపై చర్చించాలని టీడీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. స్పీకర్ తమ్మినేని సీతారామ్ టీడీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చకు నిరాకరించి ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. దీంతో టీడీపీ సభ్యులు ప్రశ్నోత్తరాలను అడ్డుకుని ఆందోళనకు దిగారు. స్పీకర్ పోడియం వద్దకు ప్లకార్డులతో వెళ్లి నిరసన తెలిపారు. స్పీకర్ పై పేపర్లు విసిరి నిరసన వ్యక్తం చేశారు.
టీడీపీ అర్ధంలేని నోటీసులు ఇచ్చారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. చంద్రబాబు అరెస్టుపై చర్చకు సిద్దమని అన్నారు. బీఏసీలో దీనిపై చర్చిద్దామన్నారు. హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పై మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. మీసాలు తిప్పడం వంటివి సినిమాల్లో చూపించుకోవాలని బాలకృష్ణను అంబటి అన్నారు. దీంతో ఫైర్ అయిన బాలకృష్ణ చూసుకుందాం రా అంటూ అంబటిని సవాల్ విసిరారు. మంత్రి అంబటి సైతం రా చూసుకుందాం అంటూ ప్రతి సవాల్ విసిరారు. అంబటి సవాల్ కు బాలకృష్ణ మీసం తిప్పి తొడగొట్టారు.
దీంతో తామూ మీసం మెలేస్తాం అని అధికార పార్టీ ఎమ్మెల్యేలు అన్నారు. బాలకృష్ణ మీసాలు తిప్పుతూ రెచ్చగొడుతున్నారని, కావాలనే ఆందోళన చేస్తున్నారని మంత్రి అంబటి అన్నారు. టీడీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని మంత్రి అంబటి కోరారు. టీడీపీ సభ్యుల తీరుతో సభలో అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉందని మంత్రి అంబటి అన్నారు. సభలో ఒకరిపై ఒకరు సవాళ్లు, ప్రతిసవాళ్లతో సభలో తీవ్ర గందరగోళం చేటుచేసుకుంది. దీంతో స్పీకర్ కొద్దిసేపు సభను వాయిదా వేశారు.
తొలుత టీడీపీ సభ్యులు వెంకటపాలెం లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సచివాలయ సమీపంలోని తుళ్లూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద టీడీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేసి అక్కడ నుండి అసెంబ్లీ వరకూ పాదయాత్రగా చేరుకున్నారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టు అంశాన్ని ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని అన్నారు. ఈ పోరాటం ఇంతటితో అగేది కాదన్నారు. ప్రజలంతా తమ వెంటే ఉన్నారన్నారు. ప్రజల్లో టీడీపీకి ఉన్న స్పందన చూసే అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. అక్రమ అరెస్టులు, అక్రమ కేసులకు భయపడేది లేదని బాలకృష్ణ అన్నారు.