CM Revanth Reddy: తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన మార్క్ పాలన అందించేందుకు చర్యలు చేపట్టారు. ఆ క్రమంలో ప్రగతి భవన్ .. ప్రజా భవన్ గా మార్పు చేసి ప్రజల నుండి సమస్యలపై అర్జీలు స్వీకరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వారినికి రెండు రోజుల పాటు మంగళ, శుక్రవారాల్లో ప్రజాదర్భార్ నిర్వహిస్తున్నారు. ప్రజల వద్ద నుండి వస్తున్న విజ్ఞప్తులను పరిష్కరించేందుకు, ప్రజా పాలన హామీలను అమలు చేసేందుకు మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేశారు.
డిప్యూటి సీఎం మల్లు భట్టివిక్రమార్క చైర్మన్ గా కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. కమిటీ సభ్యులు గా మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డిని నియమించారు. ఇంతకు ముందు ముఖ్యమంత్రి కేసిఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యేవారిని, ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇచ్చేవారు కాదనే అపవాదు ఉంది. దీని వల్ల పార్టీ ఎమ్మెల్యేలే అసంతృప్తికి గురయ్యేవారు. రేవంత్ పాలనలో అటువంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు గానూ కీలక ప్రకటన చేశారు. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ సమస్యలు చెప్పుకునేందుకు సీఎం రేవంత్ సమయం కేటాయించారు.
జనవరి 26వ తేదీ నుండి వారానికి మూడు రోజుల పాటు ఎమ్మెల్యేలకు అవకాశం ఇచ్చారు. సాయంత్రం నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకూ సచివాలంలో సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలు కలిసేందుకు ప్రత్యేకంగా టైమ్ కేటాయించారు. దీంతో నియోజకవర్గాల సమస్యలు ఎమ్మెల్యేలు చెప్పుకోవడానికి, వాటిని పరిష్కరించుకునేలా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వానికి కూడా కొంత వీలు కలుగుతుంది.
అంతే కాకుండా ఒక్క అసెంబ్లీ నియోజకవర్గానికి అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రత్యేక నిధి నుండి రూ.10 కోట్లు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇదే క్రమంలో ఎమ్మెల్యేలకు కీలక సూచన చేశారు సీఎ రేవంత్. చుట్టాలు అనో, అనుచరులు అనో అసమర్ధులైన అధికారులను మండలాల్లో నియమించుకుని అనుకూలంగా పనులు చేయించుకుంటే కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని తెలియజేస్తూ నిక్కచ్చిగా పని చేస్తూ ప్రజలకు పని చేసే అధికారులనే నియమించుకోవాలని సూచించారు. అలానే ఉమ్మడి జిల్లాల వారీగా అభివృద్ధిపై సమీక్షా సమావేశాలను నిర్వహిస్తున్నారు. సీఎం రేవంత్ అభివృద్ధికి ప్రత్యేక నిధుల కేటాయింపు, వారానికి మూడు రోజులు సమయం కేటాయించడంపై ఎమ్మెల్యేలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నెల 11 వ తేదీ నుండి మూడు రోజుల పాటు పార్లమెంట్ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. మొత్తం 17 నియోజకవర్గాల్లో 12కు తగ్గకుండా ఎంపీ స్థానాలు గెలవాలన్న లక్ష్యంతో పని చేయాలని పార్టీ నేతలకు సూచిస్తున్నారు. ఈ నెల 26వ తేదీ నుండి సీఎం రేవంత్ జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. తొలి పర్యటన ఆదిలాబాద్ జిల్లా లో ఉండనుంది. ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లిలో తొలి ప్రచార సభను రేవంత్ నిర్వహించనున్నారు. లోక్ సభ ఎన్నికల దృష్ట్యా ప్రజల్లోకి వెళ్లాలని సీఎం నిర్ణయించుకున్నారు. ఇంద్రవెల్లి నుండి సభలకు శ్రీకారం చుట్టనున్నారు. అక్కడ గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఇంద్రవెల్లి స్మారక స్మృతి భవనానికి శంకుస్థాపన చేయనున్నారు.
IT Raids: హైదరాబాద్ లో మరో సారి ఐటీ దాడుల కలకలం.. వాళ్లే టార్గెట్