SSMB29: రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. “RRR” వంటి అతిపెద్ద భారీ బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి చిత్రీకరిస్తున్న ఈ సినిమా కోసం దేశం మాత్రమే కాదు ప్రపంచం మొత్తం ఎదురుచూస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇండోనేషియాకి చెందిన అమ్మాయి హీరోయిన్ గా నటించబోతున్నట్లు వార్తలు రావటం జరిగాయి. అంతర్జాతీయ స్థాయిలో చేస్తున్న సినిమా కావటంతో విదేశీ నటులు ఉండాలని ఇండోనేషియా కు చెందిన ప్రముఖ నటి చీల్సీ ఎలిజబెత్ ఇస్లాన్ నీ జక్కన తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అమెరికాలో పుట్టిన ఈ ముద్దుగుమ్మ ఇండోనేషియా సినిమాలలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు ఉంది.
దీంతో ఈ 28 ఏళ్ల భామను మహేష్ కి జోడిగా ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా ఈ సినిమాకి సంబంధించి పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాకి ప్రముఖ కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ స్టోరీ అందించడం తెలిసిందే. ఎంఎం కీరవాణి సంగీతమని కూడా అందరికీ తెలుసు. మిగతా వివరాలు చూసుకుంటే…సినిమాటోగ్రాఫర్ గా వినోద్, VFX సూపర్ వైజర్ కమల్ కన్నన్, ప్రొడక్షన్ డిజైనర్ గా మోహన్ బింగి, ఎడిటర్ తమ్మిరాజు రంగంలోకి దిగినట్లు సమాచారం. ఇక యధావిధిగా కాస్ట్యూమ్ డిజైనర్ గా రమా రాజమౌళి పని చేయనున్నారట.
తాజాగా ఈ పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొన్ననే ఈ సినిమాకి సంబంధించి జర్మనీ వంటి దేశాలలో కీలకమైన అడవులలో మహేష్ పర్యటించారు. ప్రస్తుతం రాజమౌళి నిర్వహిస్తున్న వర్క్ షాప్ లలో పాల్గొంటున్నారు. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ అడ్వెంచర్ తరహాలో సినిమా ఉండబోతున్నట్లు సమాచారం. దీంతో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పటివరకు ప్రేక్షకులు చూడని యాక్షన్ అడ్వెంచర్ సన్నివేశాలు ఈ సినిమాలో ఉండేలా రాజమౌళి ప్లాన్ చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ మార్చి నెలలో అధికారిక ప్రకటన చేసి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.