వైసీపీ సీనియర్ నేత మంత్రి బొత్స సత్యనారాయణ పై పోటీకి ఎవరిని దింపాలా ? అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మల్ల గుల్లాలు పడుతున్నారు. బొత్స ప్రాతినిథ్యం వహిస్తున్న విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి నియోజకవర్గంలో వైసీపీ చాలా బలంగా ఉంది. ఇది బొత్సకు కంచుకోట. చీపురుపల్లి టికెట్ అనగానే తెలుగు తమ్ముళ్లు జారుకుంటున్న పరిస్థితి ఉంది. ఇక్కడ నుంచి గత ఎన్నికలలో యువనేత కిమిడి నాగార్జున పోటీ చేసి దారుణంగా ఓడిపోయారు. ఆ తర్వాత నియోజకవర్గ ఇన్చార్జిగా అక్కడే పని చేస్తున్న ఆయన స్థానికంగా పార్టీ కేడర్కు అందుబాటులో ఉండటం లేదు.
ఎక్కువగా వైజాగ్ లో ఉంటూ చుట్టపు చూపుగా చీపురుపల్లికి వస్తున్నారు. దీంతో చీపురుపల్లిలో పార్టీ అనుకున్న స్థాయిలో బలపడలేదు. సీనియర్ నేతలను నాగార్జున పక్కన పెట్టేయడంతో పాటు తన వర్గాన్ని ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. ఇది పార్టీని మరింత బలహీనపరిచింది. నాగార్జునతో పని అవ్వదు అని డిసైడ్ అయిన చంద్రబాబు.. ఇక్కడి నుంచి విశాఖపట్నంకు చెందిన కీలక నేత మాజీ మంత్రి ప్రస్తుతం విశాఖ నార్త్ ఎమ్మెల్యేగా ఉన్న గంటా శ్రీనివాసరావును చీపురుపల్లిలో బొత్సపై పోటీ చేయాలని ప్రతిపాదించారు. ఈ విషయాన్ని నేరుగా గంటాకే చెప్పారు.
అయితే గంటా తాను చీపురుపల్లిలో పోటీ చేయలేను అని చేతులు ఎత్తేశారు. తాను విశాఖ జిల్లాలోని ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం లేదా భీమిలి నుంచి పోటీ చేస్తానని చంద్రబాబుకు సూచించారు. దీంతో విజయనగరం జిల్లాకు చెందిన పార్టీ ముఖ్యనేత మాజీమంత్రి కిమిడి కళా వెంకట్రావును కోరగా ఆయన కూడా ముఖం చాటేసినట్టు తెలుస్తోంది. ఇలా సీనియర్ నేతలే బొత్సపై పోటీ చేసేందుకు వెనకాడుతుండడంతో ఏం చేయాలో తోచక చంద్రబాబు తలను పట్టుకుంటున్నారు. చేసేది ఏమీ లేక విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత పేరును పార్టీ పెద్దలు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.
బొత్స పై పోటీ చేసి పార్టీ పరువు కాపాడాలని మీసాల గీతని చంద్రబాబు బతిమిలాడుకుంటున్నట్టు విజయనగరం జిల్లా టిడిపి వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అయితే మీసాల గీత విజయనగరం నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని అనుకున్నారు. ఆమె 2014లో ఇక్కడ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో చంద్రబాబు ఆమెకు సీటు ఇవ్వకుండా అశోక్ గజపతిరాజు కుమార్తె అదితికి సీటు ఇచ్చారు. ఆ ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు.
ఇక తాజా ఎన్నికల్లో మరోసారి అదితి పేరు విజయనగరం నుంచి ఖరారు అయింది. దీంతో మీసాల గీత పేరును చీపురుపల్లి నుంచి చంద్రబాబు పరిశీలిస్తుండడంతో పాటు బొత్సపై పోటీ చేయాలని ఆమెను బతిమిలాడుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక్కడే మరో ట్విస్ట్ కూడా ఉంది. బొత్స చీపురుపల్లి నుంచి పోటీ చేస్తారా లేదా బొత్స ఝాన్సీ విశాఖ అసెంబ్లీ రేసులో ఉండడంతో విశాఖపట్నం పార్లమెంటు పరిధిలోని భీమిలి నుంచి పోటీలో ఉంటారా అన్నది చూడాలి.