వైసీపీ కంచుకోటలుగా ఉన్న రెండు జిల్లాల్లో వైసీపీ ఖాళీ అవుతోంది. 2019 ఎన్నికల్లో వైసీపీ వాష్ అవుట్ చేయడంతో పాటు చాలా బలంగా ఉన్న జిల్లాల్లో సాధారణ ఎన్నికలకు ముందు పార్టీ నుంచి పలువురు కీలక నేతలు బయటకు వచ్చేస్తుండడంతో పార్టీలో పలువురు ద్వితీయ శ్రేణి లీడర్లు కూడా ఫ్యాన్ నుంచి బయటకు వచ్చేస్తుండడంతో పార్టీ జిల్లా శ్రేణి నాయకత్వానికి, ఇటు రాష్ట్ర నాయకత్వానికి ఏ మాత్రం అంతు పట్టడం లేదు. ఆ రెండు జిల్లాలు ఏవో కాదు నెల్లూరు, పల్నాడు.
నెల్లూరు, పల్నాడు జిల్లాల్లో వైసీపీ ఖాళీ అవుతోంది. టీడీపీ గత ఎన్నికల్లో వైట్ వాష్కి గురైన నెల్లూరు జిల్లాలో ఇప్పుడు పలువురు టాప్ లీడర్లు.. అందులోనూ రెడ్డి సామాజిక వర్గం వారే బయటకు వచ్చేస్తున్నారు. బడా పారిశ్రామికవేత్తగా ఉన్న వైసీపీ రాజ్యసభ మాజీ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీథర్ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్రెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డితో పాటు పలువురు నేతలు సైకిల్ ఎక్కేస్తున్నారు.
వీరితో పాటు పలువురు నేతలు, ద్వితీయ శ్రేణి నేతలు కూడా సైకిల్ పార్టీలో చేరుతున్నారు. ఇదే నెల్లూరు జిల్లాలోని కందుకూరు ఎమ్మెల్యే మానుగంట మహీధర్ రెడ్డి సైతం టిక్కెట్ రాక పార్టీ వీడేందుకు రెడీ అవుతున్నారు. ఇక టీడీపీ ఆవిర్భావం నుంచి నెల్లూరులో సగం సీట్లు గెలిచిన దాఖలు లేవు. ఈ వరుస చేరికలతో నెల్లూరు జిల్లాలో వైసీపీ ఖాళీ అయ్యేలా ఉంది. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు జిల్లా మొత్తం మీద వైసీపీకి 10 సీట్లకు 3 సీట్లు వస్తేనే గొప్ప అంటున్నారు.
ఇక పల్నాడు జిల్లాలో నరసారావుపేట పార్లమెంటు సీటుతో పాటు మొత్తం 7 అసెంబ్లీ సీట్లను గత ఎన్నికల్లో వైసీపీ స్వీప్ చేసింది. ఇప్పుడు ఇదే జిల్లా నుంచి సిట్టింగ్ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు.. ఎమ్మెల్సీ జంగా కృషమూర్తి… మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జున రావు సహా కొన్ని వందల మంది స్థానిక సంస్థల ప్రతినిధులు, వైసీపీ కేడర్ అంతా టీడీపీలో చేరుతున్నారు. ఇక వీరితో పాటు పార్లమెంటు పరిధిలో పలువురు ఎంపీపీలు, జడ్పీటీసీలు, కౌన్సెలర్లు సైతం సైకిల్ ఎక్కేస్తున్నారు.
నరసారావుపేట పార్లమెంటు పరిధిలో చాలా మంది కీలక నేతలు, నాయకులు కూడా పార్టీ మారిపోతూ ఉండడంతో వైసీపీ బేల చూపులు చూస్తోంది. ఈ రెండు జిల్లాల్లో వైసీపీకి ఎన్నికల ముందు కోలుకోలేని దెబ్బే తగులుతుందని చెప్పాలి.