మొత్తానికి వైసీపీలో ఏదో గందరగోళం.. జగన్ పార్టీ పెట్టాక ఎప్పుడూ ఇంత కన్ఫ్యూజన్ లేదు. జగన్ పొలిటికల్ కెరీర్లో ఎప్పుడూ లేనట్టుగా ఫస్ట్ టైం బాగా తడబడుతున్నాడు. వైసీపీ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాలను వరుసగా రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే 9 జాబితాలు రిలీజ్ అయ్యాయి. ఫస్ట్ జాబితాలో ఉన్న క్యాండెట్ల పేర్లు ఆ తర్వాత జాబితాలకు వచ్చే సరికి మారిపోతున్నాయి. ఆ తర్వాత జాబితాలో ఉన్న వాళ్లు మరుసటి జాబితాలో అవుట్ అయిపోతున్నారు.
అసలు జగన్ అభ్యర్థుల పేర్లు ప్రకటించే టైంలో సరైన సర్వేలు చేయించుకున్నారా ? ప్రశాంత్ కిషోర్ టీంతో పాటు జగన్ పర్సనల్ టీంలు ఏమయ్యాయి ? రీజనల్ కో ఆర్డినేటర్లు ఏం చేస్తున్నారో కూడా ఎవ్వరికి తెలియడం లేదు. ఒక నియోజకవర్గంలో బలంగా ఉన్న వారిని పక్క నియోజకవర్గాలకు తరలించేస్తున్నారు. 20 ఏళ్లుగా ఒక నియోజకవర్గంతో అనుబంధం ఉన్న నేత పక్క నియోజకవర్గానికి వెళ్లి రెండు నెలల్లో చేసేదేం ఉంటుంది ? అసలు ఇందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో ఎవ్వరికి అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు.
ఉదాహరణకు ఇష్టం వచ్చినట్టుగా మార్పులు చేర్పులు చేసిన కొన్ని నియోజకవర్గాలను పరిశీలిద్దాం. గుంటూరు ఎంపీగా ముందు క్రికెటర్ అంబటి రాయుడు పేరు అనుకునే ఆయన్ను పార్టీలోకి తీసుకున్నారు. రాయుడు బయటకు పోయాక ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కుమారుడు ఉమ్మారెడ్డి వెంకటరమణ పేరు ప్రకటించారు. ఇప్పుడు ఆయన్ను పక్కన పెట్టేసి పొన్నూరు ఎమ్మెల్యే కిలారు వెంకట రోశయ్యను తెరమీదకు తీసుకువచ్చారు. నెల రోజుల్లోనే మూడు పేర్లు మార్చారు.
ఇక కందుకూరులో బలంగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే మహీధర్ రెడ్డిని కాదని కొండపి నియోజకవర్గం నుంచి బోట్ల రామారావు యదవ్ను కందుకూరుకు పంపారు. ఇంతలోనే ఏమైందో కాని కఠారి అరవిందా యాదవ్ పేరు ప్రకటించారు. ఇప్పుడు ఆమెను కాదని కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ను కందుకూరు ఇన్చార్జ్గా ప్రకటించారు. ఇక మంగళగిరిలో మూడు పేర్లు మారాయి. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి బయకటు వెళ్లాక గంజి చిరంజీవి పేరు ఇన్చార్జ్గా ప్రకటించారు. ఇప్పుడు మురుగుడు లావణ్యను తెరమీదకు తెచ్చారు.
ఇక తిరుపతి ఎంపీగా గురుమూర్తి పేరు తీసేసి ఆదిమూలం అన్నారు. ఆ తర్వాత మళ్లీ గురుమూర్తినే పెట్టారు. నెల్లూరులో వేమిరెడ్డి జంప్ అయితే ఇప్పుడు విజయసాయిరెడ్డిని ప్రకటించారు. కర్నూలులో మంత్రి జయరాంను పెడితే అతడు జంప్ అయిపోయాడు. సత్యవేడులో ఆదిమూలాన్ని తీసేసి ఎంపీ గురుమూర్తిని పెట్టి.. ఇప్పుడు గురుమూర్తిని తిరుపతి ఎంపీగానే ఉంచి ఖాళీగా ఉంచారు. ఏదేమైనా జగన్లో ఇంత కన్ఫ్యూజ్ ఎప్పుడూ లేదని వైసీపీ వాళ్లే చర్చించుకుంటున్నారు.