ఏపీ సీఎం జగన్, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మాతృమూర్తి విజయమ్మ.. ఏ పక్షాన ఉన్నారు? ఆమె ఎవరికి మద్దతు తెలుపుతున్నారు? అనే విషయాలు ఆసక్తిగా మారాయి. ఎందుకంటే.. ఆ ఏడాదిన్నర కిందట.. ఆమె ఏపీ రాజకీయాలతో తనకు సంబంధం లేదన్నారు. తెలంగాణలో తన కుమార్తె షర్మిల పార్టీ పెట్టారు కాబట్టి.. ఆమెకు మద్దతుగా అక్కడే రాజకీయాలు చేస్తానన్నారు. అయితే.. అనూహ్య పరిణామాల నేపథ్యంలో షర్మిల తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు.
తర్వాత ఏపీలో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టారు. దీంతో ఇప్పుడు అన్నాచెల్లెళ్లు ఇద్దరూ కూడా.. ఏపీలోనే రాజకీయాలు చేస్తున్నారు. దీంతో విజయమ్మ మద్దతు ఎవరికి ఉంటుందనే ఆసక్తికర చర్చ కామన్. కానీ, ఆమె ఇరు వర్గాలకు మద్దతుగా వ్యవహరిస్తున్నారు. సీఎం జగన్.. ఎన్నికల ప్రచారం ప్రారంభించే ముందు ఇడుపులపాయలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆ కార్యక్రమానికి విజయమ్మ వచ్చారు. కుమారుడ్ని ఆశీర్వదించారు. ఈ పరిణామం చాలా మందిని ఆశ్చర్యపరిచింది.
విజయమ్మ మద్దతు జగన్కు ఉన్నట్లేనని అందరూ అనుకున్నారు. అయితే కొద్ది రోజుల తర్వాత వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటనకు ఇడుపుల పాయకు వచ్చారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆమెతో పాటు ప్రత్యేక విమానంలో విజయలక్ష్మి వచ్చారు. కుమార్తె షర్మిలను కూడా ఆశీర్వదించారు. అంటే.. అటు కుమారుడికి.. ఇటు కుమార్తెకు కూడా ఆమె మద్దతుగా ఉంటున్నారు. అయితే ఇప్పుడు ఒకరిపై ఒకరు రాజకీయం చేసుకుంటున్నారు.
జగన్ పరోక్షంగా షర్మిలపై విమర్శలు చేస్తున్నారు. షర్మిల జగన్ పై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ఇలాంటి సమయంలో ఇద్దరి వైపు ఉండటం సాధ్యం కాదు. మరి విజయలక్ష్మి మద్దతు ఎవరికి ఉంటుంది ? షర్మిల నేరుగా తన అన్నతో ఢీకొనడానికి ఇష్టం లేకే తెలంగాణలో పార్టీ పెట్టారని గతంలో ప్రచారం జరిగింది. షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు విజయమ్మ పూర్తి మద్దతుగా నిలిచారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేసి.. తన కుమార్తె కు అండగా ఉండాలి కాబట్టి.. వెళ్తున్నానని చెప్పుకున్నారు.
పిల్లలిద్దరూ చెరో రాష్ట్రంలో రాజకీయం చేయాలని దేవుడు రాసి పెట్టారని చెప్పుకున్నారు. తెలంగాణలో వైఎస్ఆర్సీపీ పోటీ చేయడం లేదు కాబట్టి అన్నా చెల్లెళ్ల మధ్య సవాల్ జరిగే అవకాశం కనిపించ లేదు. అందుకే విజయమ్మకు కూడా ఇద్దరి మధ్య ఎవరో తేల్చుకోవాల్సిన అవసరం రాలేదు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. జగన్ ఓటమే లక్ష్యంగా షర్మిల పని చేస్తున్నారు. కాంగ్రెస్ చీఫ్ బాధ్యతలు తీసుకుని అవినాష్ రెడ్డి హత్య కేసును మెయిన్ లీడ్ గా తీసుకుని జగన్ ను కార్నర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయమ్మ ఎవరికి సపోర్టు చేస్తారనే ప్రశ్న కడపలో వినిపిస్తోంది. అయితే.. ఆమె తటస్థంగా ఉంటారని కొందరు.. కాదు.. ఇద్దరికీ సపోర్టు చేస్తారని మరికొందరు చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.