టీడీపీ నాయకుడు, నటసింహం బాలయ్య.. తన సొంత నియోజకవర్గం హిందూపురంను లైట్ తీసుకున్నా రా? షెడ్యూల్ వచ్చేసిన తర్వాత కూడా.. ఇక్కడ బాలయ్య కనీసం ఒక్కసారి కూడా పర్యటించలేదు. షెడ్యూల్ వచ్చేసి కూడా మరో వారం రోజులకు నెల అవుతోంది. అయినప్పటికీ.. బాలయ్య ఇక్కడివారితో టచ్లో కి రాలేదు. తాను స్వయంగా ఇక్కడకు రాలేదు. దీంతో బాలయ్య ఈ నియోజకవర్గాన్ని లైట్ తీసుకున్నారా? ఎలాగైనా గెలిచేస్తానని అనుకున్నారా? అనేది చర్చగా మారింది.
మరోవైపు.. వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇక్కడ నుంచి బీసీ మహిళ తిప్పేగౌడ నారాయణ దీపికకు పార్టీ అవకాశం ఇచ్చింది. ఆమె దూకుడుగా ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే మండలాల వారీగా ప్రచారం ముమ్మరం చేశారు. పైగా అసంతృప్త నేతలను ఏకం చేస్తున్నారు. వారితో భేటీ అవుతున్నారు. వారిని బుజ్జగిస్తున్నారు. ఇదేసమయంలో బాలయ్యకు వ్యతిరేకంగా కూడా కామెంట్లు చేస్తున్నారు. సినిమాలు చేసుకునేందుకు ఉన్న శ్రద్ధ నియోజకవర్గంపై ఏదని నిలదీస్తున్నారు.
ఇది.. బాలయ్య ఫ్యాన్స్కు నచ్చకపోయినా.. క్షేత్రస్థాయిలో మహిళలను ఆకట్టుకుంటోంది. అంతేకాదు.. బాలయ్య వల్ల ఈ పదేళ్లుగా ఒరిగింది ఏమీ లేదని కూడా చెబుతున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు బాలయ్యకు వ్యతిరేకంగా.. దీపికకు అనుకూలంగా జై కొడుతున్నారు. ఈ పరిణామాలు బాలయ్యకు ఇబ్బంది కలిగించేలా ఉన్నాయని అంటున్నారు. మరోవైపు బాలయ్య రాలేదు కాబట్టి మేం ఏం చేస్తామంటూ.. టీడీపీ నాయకులు కూడా దూరంగా ఉన్నారు.
ఇక, కూటమి పార్టీలైన జనసేన , బీజేపీలు కూడా.. బాలయ్యకు దూరంగా ఉంటున్నాయి. బీజేపీని బాలయ్య ఏమీ అనకపోయినా.. జనసేనపై గతంలో బాలయ్య చేసిన వ్యాఖ్యలను వైసీపీ నాయకులు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో జనసేన వర్గాలు కూడా దూరంగా ఉన్నారు. వీరిని ముందు సమన్వయం చేసుకోవాల్సిన అవసరం బాలయ్యకు ఉంది. అంతేకానీ, తనకు అచ్చొచ్చింది కాబట్టి ఇక్కడ గెలిచేస్తానంటే.. కుదిరే పనికాదని అంటున్నారు పరిశీలకులు. మరి ఎప్పుడు వస్తారో చూడాలి.