YSRCP: రాజ్యసభ సభ్యులుగా వైసీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, మేడా రఘునాథ్ రెడ్డి లు ఇవేళ ప్రమాణ స్వీకారం చేశారు. ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ ప్రమాణం చేయించారు. గొల్ల బాబూరావు హిందీలో దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేయగా, వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథ్ రెడ్డి ఆంగ్లంలో దైవ సాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు.
వీరి ప్రమాణ స్వీకారంతో రాజ్యసభలో వైసీపీ ఎంపీల సంఖ్య 11కు చేరుకుంది. ఈ క్రమంలో వైసీపీ నాలుగో అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ (97), కాంగ్రెస్ (29), తృణమూల్ కాంగ్రెస్ (13) తర్వాత స్థానంలో వైసీపీ నిలిచింది. ఇక ప్రస్తుతం రాజ్యసభలో ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సభ్యుల సంఖ్య జీరో అయ్యింది. టీడీపీ ఆవిర్భావం తర్వాత రాజ్యసభలో టీడీపీకి ఈ పరిస్థితి ఏర్పడటం ఇదే తొలిసారి.
ప్రమాణ స్వీకారం తర్వాత వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యసభలో ఇప్పుడు టీడీపీని ఆచూకీ లేకుండా చేశామన్నారు. రాజ్యసభతోనే వైనాట్ 175 ప్రారంభమైందన్నారు. ముఖ్యమంత్రిగా మళ్ల సీఎం జగన్ గెలవడం ఖాయమని అన్నారు. నాడు లోక్ సభలో ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేశానని, ఇప్పుడు సీఎం జగన్ ఆశీస్సులతో మళ్ల రాజ్యసభకు ఎన్నిక కావడం ఆనందంగా ఉందన్నారు.
రాజ్యసభలో 11 కు 11 సీట్లు వైసీపీనే గెలిచిందన్నారు. ఈ సంఖ్యాబలం వల్ల రాష్ట్ర అభివృద్ధికి మరింత మేలు జరుగుతుందని తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలు సాధిస్తామని అన్నారు. సీఎం వైఎస్ జగన్ హయాంలో సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు.
YSRCP: టీడీపీకి బిగ్ షాక్ ..అనుచరులతో వైసీపీలో చేరిన కీలక నేత కాటంరెడ్డి విష్ణువర్థన్ రెడ్డి