TDP: రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఎంపీ రఘురామ కృష్ణరాజు పోటీ చేసే అంశం హాట్ టాపిక్ గా ఉంది. రఘురామ కృష్ణరాజు ఎంపీగా పోటీ చేస్తారా..? లేక ఎమ్మెల్యే గా పోటీ చేస్తారా ..? ఎక్కడ నుండి పోటీ చేస్తారు..? అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉంది. నరసాపురం స్థానం పొత్తులో భాగంగా ఏ పార్టీకి వెళితే ఆ పార్టీ నుండి కూటమి అభ్యర్ధిగా తాను పోటీ చేస్తానని ఇంతకు ముందు రఘురామ ప్రకటించారు. అయితే పొత్తులో భాగంగా రఘురామ ప్రాతినిధ్యం వహిస్తున్న నరసాపురం స్థానం బీజేపీకి వెళ్లడం, ఆ స్థానం నుండి ఆ పార్టీ అధిష్టానం వేరే అభ్యర్ధిని ఎంపిక చేయడం జరిగిపోయాయి. దీంతో రఘురామ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
బీజేపీ, టీడీపీ, జనసేన నేతలతో సన్నిహిత సంబంధాలు ఉండటంతో ఏదో ఒక పార్టీలో చేరి పోటీ చేయడం ఖాయమని అనుకున్నారు. అయితే బీజేపీ నుండి టిక్కెట్ దక్కే పరిస్థితి లేదని స్పష్టం కావడంతో రఘురామ టీడీపీలో చేరిపోయారు. ఇటీవల (శుక్రవారం) ఆయన చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. అయితే పోటీ చేసే స్థానం ఇంకా డిసైడ్ కాలేదు. అయితే రఘురామ కృష్ణరాజుకు చంద్రబాబు ఉండి అసెంబ్లీ స్థానం కేటాయించినట్లుగా తొలుత ప్రచారం జరిగింది. టీడీపీ అనుకూల మీడియాలోనూ ఆ వార్త రావడంతో అందరూ నిజమేనని అనుకున్నారు. అయితే ఇదంతా పుకారేనని రఘురామ తేల్చి పారేశారు.
ఉండి టిక్కెట్ తనకు కేటాయించినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన అన్నారు. తనకు ఇంత వరకూ అలాంటి సమాచారం లేదని తెలిపారు. అలానే సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు కూడా ఎలాంటి సమాచారం లేదని ఆయన చెప్పారు. ఒక వేళ అభ్యర్ధిని మార్చదల్చుకుంటే ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజును పిలిపి మాట్లాడతారని, కేవలం ఊహాగానాలను నమ్మవద్దని రఘురామ కోరారు. తనకు కూడా ఈ సీటుపై ఎటువంటి సమాచారం లేదని చెప్పారు. శుక్రవారం తాను చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరానని తెలిపారు. తాను ఎటువంటి షరతులు లేకుండా టీడీపీలో చేరాననీ, పార్టీ అధిష్టానం ఎక్కడ నుండి పోటీ చేయమంటే అక్కడ నుండి పోటీ చేస్తానని తెలిపారు. లోక్ సభ లేదా అసెంబ్లీ స్థానమా అనేది చంద్రబాబు డిసైడ్ చేస్తారని చెప్పారు.
అయితే తాను ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తానని రఘురామ స్పష్టం చేశారు. ఎక్కడి నుండి అన్నది ఇంకా తేలలేదని తెలిపారు. అయితే రఘురామ టీడీపీలో చేరడం, ఆయనకు ఉండి టిక్కెట్ ఇచ్చారన్న ప్రచారం జరగడంతో ఉండి టీడీపీ అభ్యర్ధి రామరాజు వర్గీయులు మండిపడుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని ఆయనకు టిక్కెట్ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. పాలకొల్లులో పశ్చిమ గోదావరి జిల్లా అసెంబ్లీ అభ్యర్ధులతో పాటు మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ అభ్యర్ధులతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంలో పాలకొల్లులో చంద్రబాబు క్యాంప్ వద్దకు చేరుకున్న ఉండి అభ్యర్ధి రామరాజు మద్దతుదారులు పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేసినట్లు సమాచారం. చంద్రబాబు కాన్వాయ్ ను అడ్డగించి ఘోరావ్ చేశారు. రామరాజుకే సీటు ఇవ్వాలని నినాదాలు చేశారు. దీంతో ఉండి నియోజకవర్గ అభ్యర్ధిత్వం విషయంలో చంద్రబాబు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
YS Jagan: వైసీపీ అధినేత జగన్ కు ఎన్నికల సంఘం నోటీసులు .. ఎందుకంటే ..?