YSRCP: ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఈ పార్టీ నుండి ఆ పార్టీకి, ఆ పార్టీ నుండి ఈ పార్టీకి జంపింగ్ లు కొనసాగుతున్నాయి. అయితే గత కొద్ది రోజులుగా వైసీపీ అసంతృప్త కీలక నేతలు పార్టీని వీడుతున్నారు. టిక్కెట్ ఆశించి భంగపడిన సిట్టింగ్, మాజీ ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు.
తాజాగా ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఇవేళ వైసీపీని వీడారు. రీసెంట్ గా శింగనమల మాజీ ఎమ్మెల్యే యామినీ బాల వైసీపీకి రాజీనామా చేయగా, ఇవేళ ఆమె తల్లి మాజీ మంత్రి శమంతకమణి, సోదరుడు అశోక్ లు వైసీపీని వీడారు. తన రాజీనామాను శమంతకమణి పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ కు పంపించారు.
శమంతకమణి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ హయాంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత టీడీపీలో చేరారు. శింగనమల నుండి రెండు పర్యాయాలు టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి పరాజయం పాలైయ్యారు. టీడీపీలో ఎమ్మెల్సీగా పని చేశారు. 2014లో శమంతకమణి కుమార్తె యామినీ బాలకు చంద్రబాబు అవకాశం ఇవ్వగా ఆమె ఎమ్మెల్యేగా గెలిచారు.
అయితే 2019 ఎన్నికల్లో చంద్రబాబు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న యామిని బాలకు కాకుండా బండారు శ్రావణికి టిక్కెట్ ఇచ్చారు. దీంతో పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్న వీరు రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో టీడీపీకి రాజీనామా చేసి సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. తమ కుటుంబంలో ఎవరికైనా ఈ సారి ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలని వైసీపీ పార్టీ పెద్దల వద్ద ప్రతిపాదన పెట్టారు.
పార్టీ అధిష్టానం మాత్రం సింగనమల వైసీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతిని పక్కన పెట్టినా వారి తాలూకు నేతకు అభ్యర్ధిత్వం ఖరారు చేయడంతో వీరు తీవ్ర అసంతృప్తికి గురైయ్యారు. తిరిగి టీడీపీలోకి వెళ్లేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలోనే రెండు రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే యామినీ బాల వైసీపీకి రాజీనామా చేశారు. ఇవేళ ఆమె తల్లి శమంతకమణి, సోదరుడు అశోక్ లు కూడా పార్టీని వీడారు.
Supreme Court: వైఎస్ వివేకా కేసు .. శివశంకర్ రెడ్డికి సుప్రీం నోటీసులు