హైదరాబాదు, జనవరి 16: కేంద్ర ప్రభుత్వాల నుండి రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా, హక్కులు కాపాడుకోవాలంటే సంఖ్యాపరంగా (ఎంపి) పెరగాల్సిన అవసరం ఉందని ఆంధ్రపదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైకాపా అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి అన్నారు. తెలంగాణా రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు బృందం బుధవారం మధ్యాహ్నం లోటస్ పాండ్లో జగన్మోహనరెడ్డిని కలిసి ఫెడరల్ ఫ్రంట్ లక్ష్యాలను, రాష్ట్రాలకు కేంద్రం నుండి జరుగుతున్న అన్యాయాలను, భవిష్యత్తులో ఎలా ముందుకు వెళితే రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా ఉంటాయి తదితర విషయాలపై చర్చించారు. అనంతరం కెటిఆర్, జగన్లు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు.
జగన్ మాట్లాడుతూ రాష్ట్రాల ప్రయోజనాల పరిరక్షణకు తెలంగాణా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయడం హర్షనీయమని అన్నారు. రాష్ట్రాల హక్కులు కాపాడుకోవాలంటే సంఖ్యా పరంగా పెరగాలి. ఆంధ్రప్రదేశ్ ఎంపిలు 25మందికి తోడు తెలంగాణా ఎంపీలు 17మంది మొత్తం 42మంది పార్లమెంట్లో ఒక్కటిగా మాట్లాడితే ఏమైనా సాధించుకోవచ్చని అన్నారు. ప్రాంతీయ పార్టీలను ఏకం చేసేందుకు ఒక ప్లాట్ ఫాం తీసుకురావడాన్ని స్వాగతిస్తున్నామని జగన్ చెప్పారు.
రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ.. పార్లమెంట్ సాక్షిగా గత ప్రధాని ఇచ్చిన ప్రత్యేక హోదా హామీకే దిక్కు దివానా లేకుండా పోయిందన్నారు. సంఖ్యాపరంగా మన వద్ద బలం లేకపోవడం వల్ల అన్యాయం జరుగుతొందని జగన్ అన్నారు.
ఇప్పటికే తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ఫోన్ ద్వారా మాట్లాడారనీ, ఆయన సూచనల మేరకు కెటిఆర్ బృందంతో చర్చించామన్నారు. కెసిఆర్, కెటిఆర్ చెప్పిన వషయాలపై పార్టీలో విస్తృతంగా చర్చించి ముందుకు సాగుతామని జగన్ తెలిపారు.
దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసమే ఫెడరల్ ఫ్రంట్
దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పులు రావాలన్న ఆకాంక్షతో ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ అధినేత చంద్రశేఖరరావు సంవత్సరన్నర కాలంగా ఫెడరల్ ఫ్రంట్ సమాఖ్య స్పూర్తి ఆరంభించారని కెటిఆర్ అన్నారు. ఫ్రంట్ బలోపేతంలో భాగంగా కెసిఆర్ ఇప్పటికే మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్, స్టాలిన్, కుమారస్వామి, అజిత్ జోగి తదితర పార్టీ నేతలతో కలిసి చర్చించారని, ప్రయత్నానికి మద్దతు ఇవ్వాలని కోరారని కెటిఆర్ అన్నారు.
వైకాపా అధినేత, ఎపి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్తో ప్రధమ చర్చలు జరిగాయని, త్వరలో కెసిఆర్ ఎపికి వెళ్లి మరో మారు విస్తృత స్థాయిలో చర్చలు జరుపుతారని చెప్పారు.
ఫెడరల్ ఫ్రంట్లో వైసిపి కలిసినట్లేనా అని ప్రశ్నించగా అన్ని ఇప్పుడే చెబితే మీరు అడగడానికి ఏమి ఉండదు, తరువాత మేము చెప్పడానికి ఏమి ఉండదు అని కెటిఆర్ చమత్కరించారు.
ప్రత్యేక హోదాపై మా వైఖరి గతంలోనే చెప్పాం – కెటిఆర్
ప్రత్యేక హోదాపై టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ను మీడియా ప్రశ్నించగా ఈ అంశంపై తమ పార్టీ అధ్యక్షుడు, సిఎం కెసిఆర్ గతంలోనే అభిప్రాయాన్ని చెప్పారని, హోదా అంశంపై రాజ్యసభలో తమ పార్టీ నేత కె కేశవరావు, లోక్సభలో తమ ఎంపి కవిత మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు. అప్పటి ప్రధాని ఇచ్చిన మాట నిలబెట్టాలని కోరారని కెటిఆర్ చెప్పారు.
ఈ సమావేశంలో టిఆర్ఎస్ నేతలు వినోద్, సంతోష్, పల్లా రాజేశ్వరరెడ్డి, శ్రావన్కుమార్ రెడ్డ, వైసిపి నేతలు విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, మిధున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.