AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు క్యాట్(కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్)లో ఊరట కలిగింది. ఏబీ వెంకటేశ్వరరావుపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేయాలని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాదు వెంటనే సర్వీస్ లోకి తీసుకోవాలని రావాల్సిన ఏరియర్స్ మొత్తం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏపీ ప్రభుత్వం రెండోసారి సస్పెండ్ చేయడం చట్ట విరుద్ధమని స్పష్టం చేయడం జరిగింది. ఒకే కారణంతో తనని రెండుసార్లు ప్రభుత్వం సస్పెండ్ చేసినట్లు వెంకటేశ్వరరావు క్యాట్ లో సవాల్ చేశారు. దీనిపై గతంలో వాదనల పూర్తికావడంతో క్యాట్ తీర్పు రిజర్వ్ చేయడం జరిగింది. తాజాగా ఈ పిటిషన్ పై ఏబీ వెంకటేశ్వరరావుకు ఊరట కలిగించేలా తీర్పు ఇవ్వడం సంచలనంగా మారింది.
దేశాత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వెంకటేశ్వరరావు సస్పెన్షన్ చట్టవిరుద్దమని చెప్పిన తర్వాత కూడా రెండోసారి సస్పెండ్ చేయటం ఉద్యోగిని వేధించడమేనని క్యాట్ పేర్కొంది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రక్షణ పరికరాల కొనుగోలులో అక్రమాలు జరిగాయని ఆరోపణలు కారణంగా ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెండ్ చేయడం జరిగింది. కేంద్ర హోం శాఖ కూడా దీనిని ధ్రువీకరించింది. ఈ పరిణామంతో వెంకటేశ్వరరావు క్యాట్ ను ఆశ్రయించగా క్యాట్ సస్పెన్షన్ ను సమర్ధించడం జరిగింది. ఆ సమయంలో వెంకటేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఏబీవీ సస్పెన్షన్ కొట్టేసింది.
ఈ తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. సర్వీసులో ఉన్న అధికారిని రెండేళ్ల కంటే ఎక్కువ కాలం సస్పెన్షన్ లో ఉంచవద్దని ఆదేశిస్తూ ఏబీవీని విధుల్లోకి తీసుకోవాలని సుప్రీం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సుప్రీమ్ ఆదేశాలతో ఏపీ ప్రభుత్వం వెంకటేశ్వరరావును విధుల్లోకి తీసుకోవడం జరిగింది. అయితే కొంతకాలానికే తిరిగి అదే కారణం చెబుతూ సస్పెండ్ చేసింది. దీంతో వెంకటేశ్వరరావు మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై సుదీర్ఘ విచారణ అనంతరం క్యాట్ బుధవారం తుది తీర్పు ఇస్తూ.. రాష్ట్ర ప్రభుత్వాన్ని విధుల్లోకి తీసుకోవాలని సూచించింది. అంతేకాదు సస్పెన్షన్ కాలానికి జీతభత్యాలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని క్యాట్ ఆదేశించడం జరిగింది.