ఏపీలో మరో నూతన రాజకీయ పార్టీ ఏర్పాటు అయ్యింది. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గానికి చెందిన పారిశ్రామిక వేత్త రామచంద్ర యాదవ్ నేతృత్వంలో కొత్త పార్టీ పురుడు పోసుకుంది. భారత చైతన్య యువజన పార్టీ (బీసీవై) పేరుతో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. గుంటూరు – విజయవాడ జాతీయ రహదారిలో నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ప్రజా సింహగర్జన పేరుతో ఆదివారం రామచంద్ర యాదవ్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదికగా రామచంద్ర యాదవ్ కొత్త రాజకీయ పార్టీ పేరును ప్రకటించారు.
ఈ సందర్భంగా రామచంద్ర యాదవ్ తన ప్రసంగంలో ఇప్పటి వరకూ రాష్ట్రాన్ని పాలించిన పాలకులను విమర్శించారు. పార్టీలు మారుతున్నా, పాలకులు మారుతున్నా ప్రజల తరరాతలు మారడం లేదని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు, యువత, మహిళలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి జరగకపోవడంతో యువత ఉపాధి అవకాశాలకు పొరుగు రాష్ట్రాలకు వలస వెళుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం దోపిడీ. దుర్మార్గ పాలన సాగుతోందని విమర్శించారు. రాష్ట్రంలో రైతులు, యువత, మహిళలు ఇలా ఏ వర్గం సంతోషంగా లేదని అన్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలపై దాడులు పెరిగాయన్నారు. జగన్ పాలన పురాణాల్లో రాక్షసుల పాలన గుర్తు చేస్తొందని రామచంద్ర యాదవ్ విమర్శించారు.
వైసీపీలో పెద్దల నుండి కార్యకర్తల వరకూ అందరూ దోచుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రైవేటు భూములు, ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. కుటుంబ, దోపిడీ పార్టీలకు చరమగీతం పాడాలన్నారు. ఇప్పటి వరకూ వెన్నుపోటు పార్టీలకు, దోపిడీ పార్టీలకు అవకాశం ఇచ్చారనీ, భావి తరాల భవిష్యత్తు, రాష్ట్ర ప్రగతికి ఒక్క సారి భారత చైతన్య యువజన పార్టీకి ప్రజలు అవకాశం ఇవ్వాలని రామచంద్ర యాదవ్ కోరారు. ఈ సభలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ అంబేద్కర్, సూరజ్ మండల్ లు తదితరులు పాల్గొని ప్రసంగించారు. తొలుత ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. వివిధ జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో బహిరంగ సభకు హజరైయ్యారు.