ఏపీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు, ఇతర సామాన్యులు.. ప్రభుత్వం పై వ్యతిరేకంగా ఉండే వాళ్లతో పాటు ఐదేళ్లపాటు జర్నలిస్టులకు కూడా చుక్కలు చూపిస్తూ వస్తోంది. సాక్షి మీడియా మినహా ఇతర మీడియా సంస్థల్లో పనిచేసే వారు ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే.. ఎన్నో ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాప్తాడులో జరిగిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సిద్ధం సభలో.. ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై వైసీపీ కార్యకర్తలు ఎలా దాడి చేశారో చూశాం.
ఇక జగన్ కూడా పదేపదే ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ 5 మీడియా సంస్థలపై తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇక ఐదేళ్ల నుంచి ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టులు తాము జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా చేశామని.. తమకు స్థలాలు ఇచ్చేస్తున్నారని ఆశపడుతూ వస్తున్నారు. వారంతా దరఖాస్తులు చేసుకున్నారు. ఇళ్ళ స్థలాల కోసం వేలమంది అప్లై చేసుకున్నారు. ఈ ప్రక్రియ పై ప్రతివారం ఓ అప్డేట్ ప్రకటన వచ్చేది. తీరా ఎన్నికల కోడ్ వచ్చేసరికి జర్నలిస్టుల హౌస్ సైట్స్ ఫైల్ అంతా చెత్తబుట్టలోకి వెళ్ళిపోయింది.
మాజీ సమాచార ప్రసార మంత్రి పేర్ని నాని నియోజకవర్గం మచిలీపట్నంలో కలెక్టరేట్లో ఉండాల్సిన ఈ ఫైల్ ఇప్పుడు చెత్తకుప్పలో బయటపడింది. ఈ విషయాన్ని జర్నలిస్టులు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర దృష్టికి తీసుకు వెళ్లడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్లో సమాచార శాఖ డిడిని కలిసి ఆయన వివరణ ఇవ్వగా ఆయన ఆ ఫైల్ పోయిందని తప్పించుకునే ప్రయత్నం చేశారు. కొలు రవీంద్ర మాత్రం బాధ్యతారహిత్యంగా వ్యవహరిస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని డిడిని హెచ్చరించారు. మరోవైపు దీనిపై విచారణ చేస్తామని కలెక్టర్ చెప్తున్నారు.
అంటే జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఇచ్చే ఫైలు విషయంలో ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంతో ఉందో ?చెప్పేందుకు ఇంతకన్నా పెద్ద ఉదాహరణ అవసరం లేదు. ఏ జిల్లాలోనూ స్థలాలు ఇచ్చే ప్రక్రియను కనీసం చివరి దశకు కూడా తీసుకురాలేదు. కనీసం జగన్కు అనుకూలంగా ఉండే.. వైసీపీకి భజన చేసే జర్నలిస్టులకు అయినా ఇళ్ళ స్థలాలు కేటాయిస్తారని అందరూ అనుకున్నారు. ఇలా ఆశపడి దరఖాస్తు చేసుకున్న వారిలో జగన్ ప్రభుత్వానికి బాకా ఊదే మీడియా సంస్థలు, ఇండిపెండెంట్ జర్నలిస్టుల పేరుతో చలామణి అయ్యేవారే ఎక్కువగా ఉన్నారు. ప్రభుత్వ స్థలమే కదా జగన్ రాసి ఇచ్చేస్తారని అనుకున్నారు. చివరికి కోడ్ రాగానే చెత్తబుట్టలో వేశారు. స్థలాల పేరుతో జగన్ చూపించిన సినిమా దెబ్బతో జర్నలిస్టుల మైండ్ బ్లాక్ అయిపోయినట్టు అయింది.