YS Jagan: బ్రిటన్, స్విట్టర్లాండ్, ఫ్రాన్స్ లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని, ఆ మేరకు విదేశాలకు వెళ్లేందుకు బెయిల్ షరతులను సడలించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ నాంపల్లి సీబీఐ కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై నిన్న విచారణ జరిపిన సీబీఐ న్యాయస్థానం .. కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది.
ఈ నేపథ్యంలో సీబీఐ నేడు కోర్టులో తమ వాదనలు వినిపించింది. జగన్ విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వొద్దని కోర్టును సీబీఐ కోరింది. ఆ మేరకు అఫిడవిట్ దాఖలు చేసింది. అక్రమాస్తుల కేసులో విచారణ కొనసాగుతున్న దశలో విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని విజ్ఞప్తి చేసింది. వివిధ కారణాలతో ఇంతకు ముందు ఆయన విదేశాలకు వెళ్లొచ్చారని గుర్తు చేసింది. వాదనలు విన్న న్యాయస్థానం .. తీర్పును మే 14వ తేదీకి వాయిదా వేసింది.
కాగా, సీఎం జగన్ కు కోర్టు నుండి అనుమతి వస్తే ఈ నెల 17 నుండి జూన్ 1వ తేదీ వరకూ విదేశీ పర్యటన చేయాలని భావిస్తున్నారు. ఏపీలో మే 13న పోలింగ్ జరగనుండగా, జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ వ్యవధిలో ఆయన కుటుంబ సభ్యులతో గడిపేందుకు విదేశీ పర్యటన ప్లాన్ చేసినట్లు తెలుస్తొంది. గతంలోనూ జగన్ విదేశీ పర్యటనలకు సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ కోర్టు అనుమతి మంజూరు చేసింది. దీంతో ఈ పర్యాయం కూడా విదేశీ పర్యటనకు కోర్టు సానుకూల నిర్ణయం వెలువరిస్తుందని వైసీపీ శ్రేణులు ఆశాభావంతో ఉన్నారు.
AP High Court: సంక్షేమ పథకాలకు నిధుల నిలిపివేతపై హైకోర్టులో ముగిసిన వాదనలు .. తీర్పు రిజర్వు