అమరావతి : కరోనా లాక్ డౌన్ కారణంగా రాష్ట్రం లో రెండునెలల నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో పూర్తి స్థాయిలో పనులు జరగడంలేదు, తాజాగా లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ కార్యకలాపాలు ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించింది. కంటైన్మెంటు ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు మినహా అన్ని ప్రాంతాల్లో ఉద్యోగులు వంద శాతం హాజరు కావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర సచివాలయం నుంచి విభాగాధిపతులు, కలెక్టర్ కార్యాలయాలు ఇలా క్షేత్ర స్థాయి వరకూ అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ కార్యకలాపాలు ప్రారంభించాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేశారు.
ఉత్తర్వుల్లోని ప్రధాన అంశాలు….
- రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలన్నీ గురువారం నుంచి పూర్తి స్థాయిలో పనిచేస్తాయి. నూటికి నూరు శాతం ఉద్యోగులు విధులకు హాజరు కావాలి.
- కార్యాలయాల ప్రాంగణంలోకి ప్రవేశించే ద్వారం వద్ద థర్మల్ స్క్రీనింగ్ చేసి, చేతులను శానిటైజ్ చేసిన తరువాత పంపిస్తారు.
- అన్ని కార్యాలయాల్లో ప్రతి రోజు శానిటైజ్ చేయాలి.
- ప్రతీ ఉద్యోగి విధిగా మాస్క్ ధరించి విధులకు హాజరు కావాలి.
- కార్యాలయాల్లో ఆరు అడుగుల భౌతిక దూరం పాటించాలి. రెండు గంటలకోసారి సబ్బు, శానిటైజర్తో చేతులను శుభ్రం చేసుకోవాలి.
- కార్యాలయాల్లో పాన్, గుట్కా, పొగాకు వినియోగం నిషేధం. ఎవ్వరైనా ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటారు.
- ఫైల్స్, తపాల్స్ ఈ–ఆఫీస్ ద్వారానే ప్రాసెస్ చేయాలి. ఉత్తర ప్రత్యుత్తరాలను అధికారిక ఈ–మెయిల్స్ ద్వారానే చేయాలి.
- భౌతిక సమావేశాలు తగ్గించి టెలి, వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే సమావేశాలను నిర్వహించాలి.
- ఉద్యోగులు విధుల్లో ఉండగా జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే హోం క్వారంటైన్లో ఉండాలి. సంబంధిత అధికారులు సెలవును మంజూరు చేస్తారు.
- కార్యాలయాల్లోకి సందర్శకులను అనుమతించరు. స్పందన, తపాల్ సెక్షన్, రిసెప్షన్స్లో మాత్రమే సమస్యలపై విజ్ఞాపనలు చేయాలి.
- కరోనా నియంత్రణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు జారీ చేసే ఆదేశాలను ఉద్యోగులందరూ తప్పనిసరిగా పాటించాలి.
- ఈ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్లు, అన్ని ప్రభుత్వ కార్యాలయాల అధిపతులు చర్యలు తీసుకుని అమలు చేయాలి.