ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కాకుండా మరొక హాట్ టాపిక్ ఉంది. కరువు ప్రాంతం రాయలసీమకు నీరు అందించేందుకు పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు విషయమై ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేయగా తెలంగాణ సీఎం కేసీఆర్ దీనిపై ఫైర్ అవుతాడు అనుకుంటే చివరికి అతను కూడా ఆచితూచి స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం కూడా వీలైనంత ఎక్కువ నీటిని తమ రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు తరలించేందుకు అనేక ప్రాజెక్టులకు అనుమతులు లేకుండానే నిర్మిస్తున్న నేపథ్యంలో కెసిఆర్ పోతిరెడ్డిపాడు పై అనుకూలంగా మాట్లాడారు.
అయితే ఇక్కడితో ఈ విషయం సద్దుమణిగిపోయింది అని అంతా అనుకుంటున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు కేసీఆర్ పై విపరీతంగా ఫైర్ అవుతున్నారు. గతంలో వైయస్ హయాంలో అటు తెలంగాణా మరియు ఆంధ్రకు సంబంధించి ఏ సాగునీటి ప్రాజెక్టులు చేపట్టినా జైకొట్టిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా స్పందించడం గమనార్హం. రాయలసీమకు నీరు అందించే ఉద్దేశంతో చేపట్టిన ప్రాజెక్టులను అడ్డుకోవాల్సిందే అని ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు కోమటి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు.ఇక వారితో పాటు చంద్రబాబు నాయుడు శిష్యుడు మరియు ప్రస్తుత కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కూడా పోతిరెడ్డిపాడు సామర్థ్యంపై భగ్గుమన్నారు.
పార్టీ హైకమాండ్ నుండి ఎటువంటి ఆదేశం రాకుండానే అతనికి అతనే సొంతంగా ఈ అంశంపై పోరాటానికి సిద్ధమవుతున్నారు. మొదటి నుండి కాంగ్రెస్ నేతలు ఆంధ్ర-తెలంగాణ మధ్య విభేదాల రాజకీయంతోనే తమ పోరాటం మొదలు పెట్టిన దాఖలాలు ఎన్నో. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు విషయంలో ఎటువంటి కామెంట్స్ చేయడం కుదరదు కానీ రేవంత్ రెడ్డి అటు నుంచి ఈ విషయాన్ని వాడుకొని తన పొలిటికల్ మైలేజ్ పంచుకుందామని బాగా యాక్టివ్ అవుతున్నారు.
ఇక రేవంత్ రెడ్డి అందులో భాగంగా…. పోతిరెడ్డిపాడు కి వ్యతిరేకంగా కేసీఆర్ ఏనాడూ పోరాటం చేయలేదని కానీ గతంలో మాత్రం తాను దాన్ని వ్యతిరేకించాలని కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. రాయలసీమకు నీరు అందించే ప్రాజెక్టులను ముందుకు సాగనివ్వమని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ప్రకటించగా ఇందుకోసం తాను ఉద్యమం చేస్తానని కూడా చెప్పారు.
తెలంగాణను పద్ధతి ప్రకారం ఎండబెట్టే కుట్ర చేస్తున్న కేసీఆర్ తెలంగాణ ద్రోహి అని, ఆయన్ను బొంద పెట్టినా పాపం లేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో 70% పనులు పూర్తయిన ప్రాజెక్టులను పూర్తి చేయలేని అసమర్థుడు కేసీఆర్ అన్నారు. ఇలా ఒక్కసారిగా రేవంత్ రెడ్డిలో లేని ఉత్సాహానికి ఊపిరిలూదిన వారయ్యారు రెండు తెలుగు రాష్ట్రాల సీఎం లు.