ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి రావాలనే కసితో సీఎం జగన్మోహన్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగానే ఎలాంటి వ్యూహకర్తలను ఈసారి పెట్టుకోకుండానే.. తన ఆలోచనలను అమలు చేస్తూ ఉన్నారు జగన్. ఇందులో భాగంగానే సిద్ధం బహిరంగ సభలు, బస్సు యాత్రలు, రోడ్ షోలు నిర్వహించుకుంటూ జనాల్లో కలిసిపోతున్నారు. ఎక్కడ కూడా ప్రతిపక్ష పార్టీలకు చాన్స్ ఇవ్వకుండా జనాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.
ముఖ్యంగా తమ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను నమ్ముకున్న జగన్మోహన్ రెడ్డి… “ఒక్కసారి మోసపోతే గోసా పడతాం” అనే కెసిఆర్ నినాదాన్ని కూడా ఎత్తుకుంటున్నారు. కెసిఆర్ ప్రభుత్వం తెలంగాణలో దిగిపోయిన తర్వాత కాంగ్రెస్ ఇచ్చిన హామీలే ఇవి కూడా అమలు కావడం లేదు. ఇక ఇప్పుడు చంద్రబాబు పాలన వస్తే… వైసిపి అమలు చేస్తున్న పథకాలు కూడా ఆగిపోతాయనే అంశాన్ని జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి తీసుకువెళ్తున్నారు.
టిడిపి, జనసేన పార్టీలకు కంటి పైన కునుకు లేకుండా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి… షర్మిలను ఓడించేందుకు కూడా వ్యూహాలు రచిస్తున్నారు. షర్మిలను ఓడించడమే కాకుండా ఆమెకు డిపాజిట్ కూడా రాకుండా స్కెచ్ వేస్తున్నారు. ఇందులో భాగంగానే కడప జిల్లాలో ప్రచారం చేయాలని తన సతీమణి వైయస్ భారతికి బాధ్యతలు అప్పగించారు జగన్మోహన్ రెడ్డి. దీంతో గ్రౌండ్ స్థాయిలో వైయస్ భారతి కడప జిల్లా మొత్తం తిరిగేస్తున్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి కోడలు, ముఖ్యమంత్రి భార్య కావడంతో వైయస్ భారతికి అడుగడుగున మంచి స్పందన వస్తోంది.
వైయస్ వివేకానంద రెడ్డి హత్య వెనుక అవినాష్ రెడ్డి హస్తం ఉందని ప్రచారం చేస్తున్న షర్మిల వ్యాఖ్యలను జనాలు మరిచిపోయేలా వైయస్ భారతి ప్రచారం చేస్తున్నారు. షర్మిలాకు ఎలాంటి ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా షర్మిల నిలకడలేని రాజకీయ నాయకురాలిగా ఎత్తి చూపిస్తోంది వైసిపి.
తెలంగాణ రాష్ట్రంలో రాజన్న రాజ్యం తీసుకొస్తానని చెప్పిన షర్మిల.. అక్కడ పోటీ చేయకుండానే, తట్ట బుట్ట సదిరేసింది. ఇక ఇప్పుడు కడప ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల పోటీ చేస్తున్నారు. ఈ తరుణంలోనే నిలకడ లేని రాజకీయ నాయకురాలు గెలిస్తే నష్టపోతామని వైసిపి గట్టిగానే ప్రచారం చేస్తోంది. అటు వైయస్ వివేకానంద రెడ్డి రెండవ భార్యకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో గట్టిగానే ప్రచారం చేస్తోంది వైసిపి.
ఇలా అడుగడుగునా వైయస్ షర్మిల కు ప్రాధాన్యత లేకుండా, ఆమె చేసే వ్యాఖ్యల నుంచి టాపిక్ డైవర్ట్ అయ్యేలా జగన్మోహన్ రెడ్డి అన్ని వ్యూహాలు రచిస్తున్నారు. ఎలాగైనా షర్మిలకు డిపాజిట్ రాకుండా చూడాలని.. ఆ దిశగా ముందుకు వెళ్లాలని క్యాడర్కు కూడా దిశా నిర్దేశం చేశారు జగన్మోహన్ రెడ్డి. మరి కడప జిల్లాలో ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడాలి.