ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కోలాహలం నెలకొంది. అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి. మే 13వ తేదీన ఏపీలో పోలింగ్ జరగనుంది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి పవన్ కళ్యాణ్ పార్టీ అయిన జనసేన పైన ఉంది. కూటమి పొత్తు ఖరారు కాకముందు జనసేన పార్టీ పైన అందరికి భారీ అంచనా ఉండేది. తెలుగుదేశం పార్టీ కంటే జనసేన పార్టీ చాలా బలంగా కనిపించింది.
అవునన్నా కాదన్నా ఈ మాట పచ్చి వాస్తవం అని చెబుతున్నారు. అయితే తెలుగుదేశం, జనసేన అలాగే భారతీయ జనతా పార్టీ ఏకమై కూటమిగా ఏర్పడిన తర్వాత… జనసేన పార్టీ బలం పూర్తిగా తగ్గిపోయింది. పొత్తులో భాగంగా కేవలం 21 అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంటు స్థానాలు జనసేనకు అప్పగించారు. దీంతో జనసేన కార్యకర్తలతో పాటు…. ఆ పార్టీ అభిమానుల్లో ఉన్న ఉత్సాహం మొత్తం నీరుగారిపోయింది.
వచ్చే ఎన్నికల్లో గెలిచి ఎలాగైనా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారని అందరూ భావించారు. కానీ ఒక్క పొత్తు కారణంగా… జనసేన పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారిపోయింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన 21 అసెంబ్లీ స్థానాలలో పోటీ చేయబోతుంది. ఈ అన్ని స్థానాలలో కచ్చితంగా జనసేన గెలుస్తుంది అనే నమ్మకం అస్సలు లేదు. జనసేన పోటీ చేసే స్థానాలలో వైసిపి బలంగా ఉండటమే కాకుండా…. స్వతంత్ర అభ్యర్థులకు గ్లాస్ గుర్తు వచ్చింది.
పవన్ కళ్యాణ్ పోటీ చేసే పిఠాపురం నియోజకవర్గంలో కూడా వైసిపి గట్టి పోటీ ఇస్తోంది. దానికి తోడు ముద్రగడ పద్మనాభం రంగంలోకి దిగారు. కాపు ఓట్లను వైసీపీ వైపు తీసుకు వెళ్లేందుకు ముద్రగడ పద్మనాభం తన వంతు పాత్ర చేస్తున్నారు. ఎలాగైనా పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ ను తరిమికొడతామని నిత్యం శపతాలు చేస్తున్నారు ముద్రగడ. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పరిస్థితి ఇలా ఉంటే… మిగతా స్థానాలలో పోటీ చేసే జనసేన పార్టీ అభ్యర్థుల విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ప్రచారంలో కూడా జనసేన పార్టీ అంత దూకుడుగా ముందుకు వెళ్లడం లేదట. అంతేకాకుండా జనసేన పోటీ చేసే స్థానాలలో తెలుగుదేశం పార్టీ అసంతృప్తులు విపరీతంగా ఉన్నారు. జనసేన పార్టీ అభ్యర్థుల ప్రచారానికి తెలుగుదేశం పార్టీ అసంతృప్తులు సరిగా సపోర్ట్ చేయడం లేదట. అంటే ఒకవేళ జనసేన ఊపు వచ్చిన కూడా పది నుంచి 11 స్థానాలు గెలిచే ఛాన్స్ ఉంటుంది. ఈ తరుణంలోనే కూటమి అధికారంలోకి వస్తే… జనసేన ఎమ్మెల్యేలు తెలుగుదేశం లేదా బిజెపి పార్టీలోకి వెళ్లే ఛాన్సులు కూడా ఉంటాయి.
ఆ దిశగా బిజెపి ఇప్పటినుంచి అడుగులు వేస్తోందట. కూటమి అధికారంలోకి వస్తే ఏపీని తన గుప్పెట్లో పెట్టుకునేందుకు రంగం సిద్ధం చేస్తుందట బిజెపి. అయితే కూటమి అధికారంలోకి రాక… వైసిపి అధికారంలోకి వస్తే… జనసేన ఎమ్మెల్యేలు వైసీపీలో చేరే ప్రమాదం కూడా ఉంటుంది. ఎటు చూసినా జనసేన పార్టీకి భారీ నష్టమే అని చెబుతున్నారు విశ్లేషకులు. అచ్చం చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ లాగే… జనసేన పార్టీ పరిస్థితి అవుతుందని అంచనా వేస్తున్నారు. ఒకవేళ పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గెలవకపోతే… జనసేన పార్టీ భూస్థాపితం అవుతుందని కూడా కొంతమంది చెబుతున్నారు.
ఎటు చూసినా జనసేన పార్టీకి ముందు నుయ్యి వెనుక గొయ్యి లాగే తయారయ్యింది. ఇలాంటి నేపథ్యంలో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన పార్టీని ఎలా ముందుకు తీసుకువెళ్తారో చూడాలి. ఇలాంటి గడ్డు పరిస్థితులలో జనసేన పార్టీని నిలుపుకుంటే పవన్ కళ్యాణ్ కు తిరుగు లేదని కూడా కొంతమంది అంటున్నారు.