YS Sharmila: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ వాతావరణం ఆసక్తికరంగా మారుతోంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయింది. 2014, 2019 ఎన్నికల్లో అసలు బోణి కొట్టలేదు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు వైఎస్ జగన్ వైఎస్ఆర్ సీపీ పేరుతో రాజకీయ పార్టీ స్థాపించడంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన అనేక మంది నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీకి వెళ్లిపోయారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన అనేక మంది ప్రముఖ నాయకులు పరాజయాన్ని చవి చూశారు. కేవలం కొద్ది మంది కాంగ్రెస్ నాయకులు మాత్రమే కాంగ్రెస్ లో మిగిలిపోయారు.
రాష్ట్ర విభజనకు నాడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ యే కారణం అన్న భావన ప్రజల్లో ఉంది. అందుకే కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులకు డిపాజిట్ లు కూడా దక్కని పరిస్థితి నెలకొంది. గత పదేళ్లుగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. రాష్ట్రంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్ జగన్ కారణంగా కాంగ్రెస్ పార్టీకి జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు ఆయన తనయ వైఎస్ షర్మిలనే ఉపయోగించుకోవాలని భావించిన పార్టీ అధిష్టానం ఆమెకు పీసీసీ పగ్గాలు అప్పగించింది. షర్మిల రేపు పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టనున్నారు. పార్టీలో నూతన ఉత్తేజం వైఎస్ షర్మిల ద్వారా సాధ్యం అవుతుందని ఆ పార్టీ హైకమాండ్ తో పాటు ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.
ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల ఆదివారం విజయవాడలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇవేళ వైఎస్ షర్మిల హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో బయలుదేరి సాయంత్రం నాలుగు గంటలకు కడపకు చేరుకుంటారు. అక్కడ నుండి ఇడుపులపాయకు చేరుకుని తండ్రి వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళులర్పిస్తారు. ఇవేళ రాత్రి ఇడుపులపాయలోనే బస చేసి రేపు (ఆదివారం) ఉదయం కడప నుండి ప్రత్యేక విమానంలో గన్నవరంకు చేరుకుంటారు. ఆదివారం ఉదయం 11 గంటలకు విజయవాడలో పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరిస్తారు వైఎస్ షర్మిల. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ఆత్మగా వెన్నంటి ఉన్న మాజీ రాజ్యసభ్యుడు కేవీపీ రామచంద్రరావు ఇప్పుడు షర్మిల వెంట ఉండనున్నారు.
మరో పక్క షర్మిల బాధ్యతలు స్వీకరించిన వెంటనే పార్టీలో చేరికలపై దృష్టి పెట్టాలని భావిస్తున్నారుట. ఈ క్రమంలో భాగంగా షర్మిల బాధ్యతల స్వీకరణ వేళ భారీగా పార్టీ అభిమానులు హజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి .. షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇంతకు ముందే ఆర్కే తాను షర్మిల వెంట నడుస్తానని ప్రకటించారు. ఆర్కే బాటలోనే రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తో పాటు రాయలసీమలోని పలువురు వైసీపీ నేతలు కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోవడానికి సిద్దమైయ్యారని వార్తలు వినబడుతున్నాయి.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో తాజాగా టికెట్ దక్కని మరో ఎమ్మెల్యేతో కాంగ్రెస్ సీనియర్ నేత ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లుగా తెలుస్తొంది. వైసీపీతో పాటు టీడీపీ నేతలు కొందరిని పార్టీలో చేర్చుకునే దిశగా షర్మిల టీమ్ సిద్దమవుతోందని అంటున్నారు. పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత వైఎస్ షర్మిల జిల్లాల పర్యటనలకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ప్రతి జిల్లాలో సమావేశాలను ఏర్పాటు చేసి పార్టీలో చేరికల ద్వారా బలోపేతం చేయాలని భావిస్తున్నారుట. రేపు (ఆదివారం) షర్మిల పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత చేసే ప్రసంగంపై సర్వత్రా ఆసక్తినెలకొంది. ఏపీలో తన అన్న సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్ సీపీపై పోరాటం చేయాల్సి ఉండటంతో ఏ విధంగా ప్రణాళికతో వెళతారు అనేది వేచి చూడాలి.
Fake Ayodhya Laddoos: అమెజాన్ కు కేంద్రం నోటీసులు .. ఎందుకంటే..?