YSRCP Vs TDP: రాజకీయంగా అనుభవం, వయస్సు తగ్గువే కానీ పొలిటికల్ స్ట్రాటజీలో వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తీరు ఎవరికీ అర్ధం కాదు. జగన్ సర్కార్ తీసుకుంటున్న పలు నిర్ణయాలను ప్రతిపక్షాలు, కోర్టులు తప్పుబడుతున్నా పేద వర్గాలకు మేలు చేయాలని చూస్తుంటే ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయి అంటూ వారిని పేదవర్గాల ద్రోహులుగా విమర్శిస్తుంది వైసీపీ.
అలానే ఇప్పుడు తాజాగా రాజ్యసభ ఎన్నికల్లో స్ట్రాటజీతో ముందుకు వెళుతున్నారు సీఎం వైఎస్ జగన్. త్వరలో ఖాళీ కానున్న మూడు రాజ్యసభ స్థానాలను కైవశం చేసుకునే విషయంలోనూ జగన్ అదే తరహాలో ముందుకు వెళుతున్నారు. ఏపీ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న సీఎం రమేష్ (బీజేపీ), కనకమేడల రవీంద్ర కుమార్ (టీడీపీ), వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి (వైసీపీ) ల పదవీ కాలం మరో రెండు నెలల్లో ముగియనుంది. ఖాళీ అవుతున్న ఈ మూడు స్థానాలు సాధించేందుకు వైసీపీకి అసెంబ్లీలో సంపూర్ణ బలం ఉంది. అయితే ఈ తరుణంలో ఇన్ చార్జిలు సిట్టింగ్ ల మార్పులు చేర్పుల వల్ల కొందరు ఎమ్మెల్యేలు పార్టీకి వ్యతిరేకంగా మారే ప్రమాదం కూడా పొంచి ఉంది.
ఇప్పటికే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడటంతో వారిని పార్టీ నుండి సస్పెండ్ కూడా చేసింది వైసీపీ. ఈ నలుగురు ఎమ్మెల్యేలు రానున్న రాజ్యసభ ఎన్నికల్లో ప్రతిపక్షం అభ్యర్ధిని పోటీకి దింపితే ఓటు వేసే అవకాశం ఉండటంతో తాజాగా వారి శాసనసభ సభ్యత్వాలను రద్దు చేయాలని స్పీకర్ కు ఫిర్యాదు అందజేసింది వైసీపీ. అలానే ఇప్పటి నుండి పార్టీకి వ్యతిరేకంగా ఉండే ఎమ్మెల్యేలను నిర్మోహమాటంగా పార్టీ నుండి సస్పెండ్ చేసే అవకాశం ఉంది. అంతే కాకుండా వారిపైనా అనర్హత వేటు వేసే అవకాశం ఉంటుంది. రాజ్యసభ ఎన్నికల్లో ఒక్కో అభ్యర్ధి గెలుపునకు 44 ఓట్లు రావాల్సి ఉంటుంది. టీడీపీకి సంఖ్యాబలం లేకపోయినా నాల్గవ అభ్యర్ధిని పోటీ పెడితే ఓటింగ్ అనివార్యం అవుతుంది. దానికి ఓ స్ట్రాటజీ సిద్దం చేసింది వైసీపీ.
రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి అభ్యర్ధిని నిలపాలా వద్దా అనే దానిపై టీడీపీ సంక్రాంతి తర్వాత నిర్ణయం తీసుకుంటుందని అంటున్నారు. ఇదే క్రమంలో వైసీపీ రాజ్యసభ సభ్యులను ఎంపిక చేసింది. ఉత్తరాంధ్ర పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి తో పాటు రాబోయే ఎన్నికల్లో టికెట్ లు దక్కని పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు లను రాజ్యసభ అభ్యర్ధులుగా వైసీపీ ఖరారు చేసినట్లుగా తెలుస్తొంది. వీరిలో గొల్ల బాబూరావు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేత కాగా, ఆరణి శ్రీనివాసులు బలిజ సామాజికవర్గానికి చెందిన నేత.
ఈ తరుణంలో టీడీపీ ఒక వేళ క్రాస్ ఓటింగ్ ద్వారా ఒక రాజ్యసభ దక్కించుకోవచ్చని భావించి పోటీకి పెడితే .. ఎస్సీ, బీసీ నేతలు రాజ్యసభకు వెళ్లకూడదా, వీరిని అడ్డుకోవడం కోసమే టీడీపీ పోటీ పెట్టిందని విమర్శించే అవకాశం ఉంటుంది. ఒక వేళ ఎస్సీ అభ్యర్ధినే టీడీపీ పోటీకి బరిలోకి దింపితే బలం లేకపోయినా ఓడిపోతారని తెలిసి బలి పసువు చేయడం కోసం నిలిపారని ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంచుమర్తి అనురాధను పోటీకి దింపిన సమయంలో అదే విధంగా టీడీపీ విమర్శలు ఎదుర్కొంది. బలం లేకపోయినా ఓడిపోతారని తెలిసి కూడా బీసీ మహిళను పోటీకి పెట్టారని విమర్శించారు.
రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిని బరిలోకి దింపితే మాత్రం తీవ్రంగా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ఈ విమర్శలు ఎదుర్కొనే బదులు గౌరవంగా పోటీ పెట్టకుండా ఉంటేనే బెటర్ అన్న భావన వచ్చేలా ముందర కాళ్లకు భంధం వేస్తొంది వైసీపీ. ఆ స్ట్రాటజీలో భాగంగానే ఒక బీసీ, ఒక ఎస్సీ నేతకు అవకాశం కల్పిస్తొంది వైసీపీ. ఈ సంకట స్థితిలో టీడీపీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది వేచి చూడాలి.
YS Sharmila: వైఎస్ షర్మిలపై కాంగ్రెస్ మాజీ ఎంపీ హర్షకుమార్ కీలక వ్యాఖ్యలు