Janasena TDP: రాజకీయాల్లో సమీకరణాలు ఒక్కో సారి వేగం మారుతుంటాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో కొత్త కొత్త నాయకులు వస్తుంటారు. పాత వారు యాక్టివ్ అవుతుంటారు. ఈ కారణంగా ఎన్నికల్లో తమకే టికెట్ వస్తుందనుకున్న వారు భంగపాటుకు గురి కావాల్సి వస్తుంటుంది. టీడీపీ – జనసేన పొత్తు కారణంగా సుమారు 40కిపైగా నియోజకవర్గాల్లో టీడీపీ ఆశావహులు త్యాగాలకు సిద్దం అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది.
ప్రస్తుతం అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గం నుండి టీడీపీ తరపున పోటీ చేసే అభ్యర్ధులు ఎవరూ లేరు. గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన ప్రముఖ వ్యాపార వేత్త అడారి ఆనంద్ కుమార్ ఆ తర్వాత వైసీపీలో చేరారు. ప్రస్తుతం అనకాపల్లి లోక్ సభ స్థానం నుండి పోటీ చేయడానికి సమర్ధుడైన అభ్యర్ధి ఎవరూ లేకపోవడంతో తన కుమారుడు చింతకాయల విజయ్ ను రాబోయే ఎన్నికల్లో పోటీకి నిలపాలని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు భావిస్తున్నారు.
1996లో అనకాపల్లి లోక్ సభ స్థానం నుండి నాటి సిట్టింగ్ ఎంపీ కొణతాల రామకృష్ణపై అయ్యన్నపాత్రుడు విజయం సాధించారు. ఇప్పుడు తన కుమారుడు విజయ్ ని అనకాపల్లి లోక్ సభ స్థానం నుండి, తను నర్సీపట్నం అసెంబ్లీ నుండి పోటీ చేయాలని అయ్యన్నపాత్రుడు భావిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం ఇదే విషయాన్ని తెలియజేసారు. పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశిస్తే తన కుమారుడు విజయ్ ను అనకాపల్లి లోక్ సభ స్థానం నుండి పోటీ చేయిస్తానని అయ్యన్నపాత్రుడు ప్రకటించారు.
అయితే అనూహ్యంగా అదే పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేయాలని భావిస్తున్న మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు కొణతాల రామకృష్ణ జనసేన కండువా కప్పుకోవడానికి సిద్దమైయ్యారు. రాష్ట్ర విభజనకు పూర్వం ఉత్తరాంధ్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన కొణతాల రామకృష్ణ దాదాపు పదేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 1980వ దశకంలోనే కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన కొణతాల రామకృష్ణ 1989, 1991 ఎన్నికల్లో అనకాపల్లి ఎంపిగా గెలిచారు. 1996 ఎన్నికల్లో అయ్యన్నపాత్రుడు చేతిలో ఓటమి పాలైయ్యారు.
విశాఖ పట్నం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగానూ బాధ్యతలు నిర్వహించారు కొణతాల. ఆ తర్వాత 1999 ఎన్నికల్లో అనకాపల్లి అసెంబ్లీ నుండి పోటీ చేసి టీడీపీ అభ్యర్ధి దాడి వీరభద్రరావు చేతిలో పరాజయం పాలైయ్యారు. తదుపరి 2004 ఎన్నికల్లో దాడి వీరభద్రరావుపై విజయం సాధించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రి వర్గంలో వాణిజ్య పన్నుల శాఖ ను నిర్వహించారు. 2009 ఎన్నికల్లో ఓటమి పాలైనా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఉత్తరాంధ్రలో తన హవా కొనసాగించారు.
వైఎస్ఆర్ సన్నిహితుడైన రామకృష్ణ .. వైఎస్ఆర్ మరణం తర్వాత వైఎస్ జగన్మోహనరెడ్డికి అండగా నిలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో విశాఖ పార్లమెంట్ ఇన్ చార్జిగా వ్యవహరించారు. విశాఖ లోక్ సభ స్థానానికి వైఎస్ విజయమ్మ పోటీ చేయగా, ప్రచారంలో అన్నీ తానై చూసుకున్నాడు. ఆ తర్వాత వైసీపీకి, క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. గతంలో టీడీపీ చేరనున్నారని ప్రచారం జరిగినా ఆయన ఆ పార్టీలో చేరలేదు. రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ రైతు, కార్మిక సమస్యలపై తన పోరాటాన్ని కొనసాగించారు.
ఇప్పుడు మళ్లీ అనకాపల్లి లోక్ సభ స్థానం నుండి పోటీ చేయాలని భావిస్తున్న కొణతాల కొద్ది కాలంగా యాక్టివ్ అయ్యారు. టీడీపీ – జనసేన ఉమ్మడి అభ్యర్ధిగా పోటీకి దిగితే గెలుపు ఖాయమన్న అంచనాతో ఉన్న రామకృష్ణ .. జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తొంది. తాజాగా నిన్న హైదరాబాద్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లి కొణతాల భేటీ అయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, ఉత్తరాంధ్ర పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం.
ఇదే క్రమంలో ఎంపీ టికెట్ తనకు ఇవ్వాలని కోరినట్లు తెలుస్తొంది. ఈ నెలలోనే మంచి ముహూర్తం చూసుకుని జనసేన కండువా కప్పుకోబోతున్నారు కొణతాల. కొణతాల సుదీర్ఘ రాజకీయ అనుభవం జనసేనకు కలిసి వస్తుందని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. పొత్తులో భాగంగా అనకాపల్లి లోక్ సభ స్థానాన్ని జనసేనకు కేటాయిస్తే కొణతాల పోటీ దాదాపు ఖాయమైనట్లే అవుతుంది. ఇదే జరిగితే సీనియర్ టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు ఆశలపై నీళ్లు చల్లినట్లు అవుతుంది. చూడాలి ఏమి జరుగుతుందో..!
TDP: అనంత టీడీపీలో భగ్గుమన్న గ్రూపు విభేదాలు