YSRCP: వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అభ్యర్ధుల ఎంపికలో అనుసరిస్తున్న వ్యూహాలు ప్రత్యర్ధులకు అంతుబట్టడం లేదు. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు కొనసాగిస్తున్నారు. గెలుపు అవకాశాలు లేని నేతలను నిర్మోహమాటంగా పక్కన పెట్టేస్తున్నారు. ఎవరూ ఊహించని వారు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్ధులు అవుతున్నారు. తాజాగా వైసీపీ ప్రకటించిన జాబితాలో ఆ పార్టీకి బద్ద శత్రువుగా మారిన నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు ప్రత్యర్ధిగా ఓ మహిళా అడ్వకేట్ ను ఫిక్స్ చేశారు సీఎం వైఎస్ జగన్.
గత ఎన్నికల్లో వైసీపీ నుండి ఎంపీగా గెలిచిన రఘురామ కృష్ణం రాజు కొద్ది రోజులకే ఆ పార్టీకి వ్యతిరేకంగా మారారు. ప్రభుత్వాన్ని, సీఎం జగన్మోహనరెడ్డి విధానాలను నిత్యం విమర్శిస్తూ, ఆరోపణలు చేస్తూ కొరకరాని కొయ్యగా మారారు. ఆయన లోక్ సభ సభ్యత్వం రద్దు చేయించేందుకు పార్టీ చేసిన ప్రయత్నాలు విఫలమైయ్యాయి. ఆ క్రమంలో రాబోయే ఎన్నికల్లో రఘురామ కృష్ణంరాజును ఎట్టిపరిస్థితుల్లో ఓడించాలని, లోక్ సభలో మళ్లీ అడుగు పెట్టకుండా చేసేందుకు ధీటైన అభ్యర్ధిని వైసీపీ రంగంలోకి దింపుతారని ప్రచారం జరిగింది.
జీవీకే రాజు ఆసక్తి చూపకపోవడంతో …
ఆ క్రమంలో దివంగత మాజీ ఎంపీ కృష్ణంరాజు సతీమణిని రఘురామ కృష్ణంరాజుకు ప్రత్యర్ధిగా రంగంలోకి దింపేందుకు వైసీపీ పావులు కదుపుతోందని ప్రచారం జరిగింది. నరసాపురం లోక్ సభ స్థానం నుండి క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వారే ఎక్కువగా ఎన్నిక అవుతూ వచ్చారు. ఆ క్రమంలో తొలుత మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు తనయుడు జీవీకే రంగరాజును వైసీపీ లోక్ సభ సమన్వయకర్తగా నియమించింది. అయితే ఆయన పోటీకి సముఖంగా లేకపోవడంతో జగన్మోహనరెడ్డి ఈ నియోజకవర్గంలో కొత్త ప్రయోగాన్ని చేశారు. వాస్తవానికి నరసాపురం పార్లమెంట్ పరిధిలో క్షత్రియ, కాపు(శెట్టి బలిజ) సామాజిక ఓటింగ్ అభ్యర్ధుల గెలుపు ఓటములను ప్రభావితం చేస్తుంటుంది.
కాపు సామాజికవర్గ ఓటింగ్ బలంగా ఉన్నా …
1984 నుండి ఇప్పటి వరకూ జరిగిన పది ఎన్నికల్లో రెండు సార్లు మాత్రమే క్షత్రియేతర అభ్యర్ధులు గెలిచారు. 1996లో టీడీపీ అభ్యర్ధిగా కొత్తపల్లి సుబ్బారాయుడు, 2004లో కాంగ్రెస్ పార్టీ తరపున చేగొండి హరిరామ జోగయ్యలు విజయం సాధించారు. మిగతా ఎనిమిది సార్లు క్షత్రియ సామాజిక వర్గ నేతలే విజయం సాధిస్తూ వచ్చారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు శెట్టి బలిజ సామాజికవర్గానికి చెందిన మాజీ మంత్రి పితాని సత్యనారాయణ బావ గుబ్బల తమ్మయ్యను నరసాపురం లోక్ సభ అభ్యర్ధిగా పోటీ చేయించగా 2 లక్షల 67వేలు ఓట్లు వచ్చాయి. త్రిముఖ పోటీలో టీడీపీ అభ్యర్ధి తోట సీతారామ లక్ష్మి పై నాటి కాంగ్రెస్ అభ్యర్ధి కనుమూరి బాపిరాజు లక్షా 14వేల మెజార్టీతో గెలిచారు.
గత ఎన్నికల్లో జనసేన పార్టీ నుండి కొణిదెల నాగేంద్ర బాబు పోటీ చేయగా రెండున్నర లక్షల ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు. టీడీపీ అభ్యర్ధి శివరామ రాజు పై కేవలం 31వేల ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్ధిగా రఘురామ కృష్ణంరాజు గెలిచారు. రాబోయే ఎన్నికల్లో జనసేన – టీడీపీ ఉమ్మడి అభ్యర్ధిగా రఘురామ కృష్ణంరాజు (ఆర్ఆర్ఆర్) పోటీ చేస్తున్న నేపథ్యంలో పూర్తిగా సోషల్ ఇంజనీరింగ్ పాటిస్తూ జగన్ మొదటి సారి శెట్టిబలిజ సామాజిక వర్గ మహిళా అడ్వకేట్ గూడూరి ఉమాబాలను అభ్యర్ధిగా ప్రకటించారు.
ఉమాబాల రాజకీయ నేపథ్యం
దీంతో ఆర్ధికంగా, సామాజికంగా బలవంతుడైన ఎంపీ రఘురామకృష్ణంరాజుకు గూడురు ఉమాబాల సరైన ప్రత్యర్ధి అవుతుందా..?ఇంతకు ఆమె ఎవరు..? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటి ? అనే సందేహాలు అందరిలో వస్తున్నాయి. వాస్తవానికి ఉమాబాల అంత ఆర్ధిక స్థితిమంతురాలు అయితే కాదు కానీ.. సుమారు మూడు దశాబ్దాలుగా క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు. భీమవరంకు చెందిన ఉమాబాల న్యాయవాద విద్యలో గోల్డ్ మెడల్ సాధించారు. న్యాయవాదిగా ఉంటూనే 1995 నుండి భీమవరం మున్సిపల్ రాజకీయాల్లో కీలకంగా ఉంటూ కౌన్సిలర్ గా ఎన్నికైయ్యారు. 2001లో మున్సిపల్ చైర్మన్ అభ్యర్ధిగా పోటీ చేశారు.
అంతకు ముందు కాంగ్రెస్ పార్టీలో జిల్లా మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా, జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, డీసీసీ ప్రధాన కార్యదర్శిగా, ఐఎన్టీయూసీ మహిళా విభాగం జిల్లా కన్వీనర్ గా, రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శిగా, ద్వారకా తిరుమల దేవస్థానం పాలకమండలి సభ్యురాలిగా పని చేశారు. ప్రస్తుతం వైసీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఉన్నారు. జిల్లాలో బీసీ మహిళా నేతగా మంచి గుర్తింపుతో పాటు పార్టీ రాజకీయాల్లో చురుగ్గా పని చేస్తున్నారనే పేరు ఉంది. అయితే అనూహ్యంగా ఉమాబాలకు లోక్ సభ సీటు కేటాయించడంపై వైసీపీ వర్గాల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆమె టీడీపీ – జనసేన కూటమి అభ్యర్ధికి ఎంత వరకు పోటీ ఇస్తుందన్న సందేహాలు అనేక మంది వ్యక్తం చేస్తున్నారు. అయితే సీఎం జగన్మోహనరెడ్డి లెక్క వేరుగా ఉంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్దిదారుల కుటుంబాలే వైసీపీ గెలుపునకు దోహదపడతారని భావిస్తున్నారు.
BRS: బీఆర్ఎస్ కు బిగ్ షాక్ .. సీనియర్ నేత తాటికొండ రాజయ్య రాజీనామా