TDP – Janasena: కడప అసెంబ్లీ నియోజకవర్గంలో కొత్త ప్రయోగం చేసేందుకు మహిళా నేతకు ఇన్ చార్జి బాధ్యతలు అప్పగించారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఈ నియోజకవర్గంలో 2004,2009 ఎన్నికల్లో కాంగ్రెస్, ఆ తర్వాత 2014, 2019 ఎన్నికల్లో వరుసగా వైసీపీ విజయం సాధించింది. అంతకు ముందు 1983,1985, 1994,1999 ఎన్నికల్లో మాత్రమే టీడీపీ అభ్యర్ధులు గెలిచారు.
కడప అసెంబ్లీ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీ ఓటర్ల తర్వాత బలిజ, రెడ్డి సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువ. మూడు దశాబ్దాలుగా ఏ పార్టీ అయినా ఇక్కడ ముస్లిం మైనార్టీ అభ్యర్ధులే గెలుస్తూ వస్తున్నారు. ప్రస్తుతం వైసీపీ మైనార్టీ నేత అమ్జాద్ బాష కడప నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014 లో 45వేలకుపైగా ఓట్లతో, 2019 లో 54వేలకుపైగా ఓట్ల మెజార్టీతో అమ్జాద్ బాషా విజయం సాధించారు. గత ఎన్నికల్లో టీడీపీ ముస్లిం మైనార్టీ అభ్యర్ధి అమీర్ బాబును బరిలోకి దింపినా 54వేలకుపైగా ఓట్లతో వైసీపీ అభ్యర్ధి అమ్జాద్ బాషా గెలిచారు.
ఈ నేపథ్యంలో కడప లోక్ సభ టీడీపీ అభ్యర్ధిగా ఉన్న రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి .. కడప అసెంబ్లీ టికెట్ ను తన సతీమణి మాధవి రెడ్డికి అప్పగించాలని గతంలోనే టీడీపీ అధినేత చంద్రబాబును కోరారు. శ్రీనివాసరెడ్డి అభ్యర్ధన మేరకు గత ఏడాది సెప్టెంబర్ మొదటి వారంలో చంద్రబాబు స్కిల్ కేసులో అరెస్టు కావడానికి ఒక రోజు ముందు కడప టీడీపీ ఇన్ చార్జిగా మాధవి రెడ్డి పేరును ప్రకటించారు. ఈ నియోజకవర్గం గతంలో ఏ పార్టీ తరపున మహిళా అభ్యర్ధి పోటీ చేయలేదు. మొదటి సారిగా మహిళా నేతకు చంద్రబాబు అవకాశం ఇచ్చారు.
దీంతో అప్పటి నుండి మాధవి రెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా గడప గడపకు తిరుగుతూ.. కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తూ వస్తున్నారు. అయితే ఆ తర్వాత జనసేనతో టీడీపీ పొత్తు కన్ఫర్మ్ కావడం, మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కుటుంబంలో ఒకరికే టికెట్ అన్న కాన్సెప్ట్ టీడీపీ తెరపైకి తెచ్చింది. శ్రీనివాసరెడ్డి కడప టీడీపీ పార్లమెంట్ ఇన్ చార్జిగా ఉండగా, ఆయన సోదరుడు రమేష్ రెడ్డి రాయచోటి అసెంబ్లీ ఇన్ చార్జిగా ఉన్నారు. మరో పక్క శ్రీనివాసరెడ్డి సతీమణి మాదవి రెడ్డి కడప అసెంబ్లీ ఇన్ చార్జిగా ఉన్నారు. అయితే చంద్రబాబు గతంలోనే హామీ ఇచ్చి ఉండటంతో శ్రీనివాసరెడ్డి, మాధవి దంపతులు అభ్యర్ధులుగానే ప్రచారం చేసుకుంటూ పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు.
మరో పక్క ఈ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీల తర్వాత బలిజ సామాజికవర్గ ఓటింగ్ ఎక్కువగా ఉండటంతో పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించాలని కోరుతున్నారు. ఆ సామాజికవర్గానికి చెందిన ఉమ్మడి కడప జిల్లాల పార్టీ ఇన్ చార్జి సుంకర శ్రీనివాస్ కు అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని ఆ పార్టీ నేతలు ఇటీవల నిర్వహించిన సమావేశంలో తీర్మానం చేశారు. చాలా కాలంగా ఉమ్మడి కడప జిల్లాలో జనసేన బలోపేతానికి సుంకర శ్రీనివాస్ కృషి చేస్తున్నారు. భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాల్లో టీడీపీ, జనసేన నేతలు పాల్గొంటున్నారు.
టీడీపీ ఇంత వరకూ అసెంబ్లీ అభ్యర్ధిని ప్రకటించలేదనీ, రెండు పార్టీల సీట్ల సర్దుబాటు తర్వాతనే అభ్యర్ధుల ప్రకటన ఉంటుందని జనసేన నేతలు చెబుతున్నారు. తమ తీర్మానాన్ని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళతామని నేతలు అంటున్నారు. ఓ పక్క జనసేన పార్టీ జిల్లా ఇన్ చార్జి సుంకర శ్రీనివాస్, మరో పక్క టీడీపీ పార్లమెంట్ అభ్యర్ధి శ్రీనివాస్ సతీమణి మాధవి రెడ్డిలు టికెట్ రేసులో ఉండటంతో కడప నుండి టీడీపీ పోటీ చేస్తుందా..? జనసేనకు పొత్తులో భాగంగా కేటాయిస్తారా..? అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఆయా పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు కడప అసెంబ్లీ అభ్యర్ధి ఎంపిక పెద్ద తలనొప్పిగా మారుతోంది. ఏమి జరుగుతుందో చూడాలి మరి..!