JD Lakshminarayana: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయమని బీజేపీ పెద్దలు గతంలో చాలా సార్లు సెలవు ఇచ్చారు. కానీ ఏపీలోని రాజకీయ నాయకులు మాత్రం ప్రజల చెవిలో పువ్వులు పెట్టేందుకు పాడిందే పాటరా పాటిపళ్ల దాసర అన్న చందంగా ప్రత్యేక హోదా అంటూనే ఉన్నారు.
రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు దాటి పోయింది. విభజన హామీలు గాలికిపోయాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఆస్తుల విభజన ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉంది. గత ఎన్నికల సమయంలో 25 పార్లమెంట్ సభ్యులను ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామని వైసీపీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజలకు హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రజలు వైసీపీకి 22 లోక్ సభ స్థానాలు కట్టబెట్టారు.
అయితే రాష్ట్ర ఎంపీలతో అవసరం లేకుండానే కేంద్రంలో బీజేపీ 300కుపైగా స్థానాలతో ఫుల్ ప్లెడ్జ్ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. దీంతో అప్పట్లోనే సీఎం జగన్ చేతులు ఎత్తేశారు. మన పార్లమెంట్ సభ్యుల మద్దతు అవసరం లేకుండానే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడినందున గొడవ చేయడం వల్ల ఉపయోగం లేదని ప్రత్యేక హోదా అడుగుతూనే ఉంటామని చెప్పారు జగన్. అప్పుడు చెప్పినట్లుగా ఢిల్లీకి వెళ్లిన ప్రతి సారి తన విజ్ఞాపనలో ప్రత్యేక హోదా అంశాన్ని ప్రసావిస్తూనే ఉన్నారు.
కేంద్రంతో కయ్యం పెట్టుకోకుండా అవసరానికి అప్పులు సాధించుకుంటూ రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలునకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నెట్టుకు వస్తున్నారు. ఇక మూడు ఎంపీ స్థానాలు మాత్రమే గెలుచుకున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎన్నికల్లో ఓటమి తర్వాత జ్ఞానోదయం అయ్యింది. కేంద్రంలోని బీజేపీ (మోడీ, షా ద్వయం) అండలేకపోతే ఎంత నష్టం జరుగుతుందో అర్ధం అయ్యింది. దీంతో బీజేపీ (ఎన్డీఏ) తనకు తలుపులు ఎప్పుడు తెరుస్తుందా వెళ్తామన్న ఆలోచనలో ఉన్నారు.
నేరుగా ఎన్డీఏలో లేకపోయినా ఏపీలోని అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ రెండూ కేంద్రంలోని బీజేపీకి అనధికార మిత్రపక్షంగానే వ్యవహరిస్తూ వస్తున్నాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి ఈ రెండు పార్టీలు కేంద్రాన్ని నిలదీసే పరిస్థితి లేదు. ఇప్పుడు తాజాగా ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల .. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలు పోలవరం ప్రాజెక్టు, రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్ తదితర అంశాలను ప్రచార అస్త్రాలుగా చేసుకుంటున్నారు. ఈ అంశాలపై ప్రధాని మోడీకి లేఖ కూడా రాశారు వైఎస్ షర్మిల.
ఇదే సమయంలో జై భారత్ నేషనల్ పేరుతో రాజకీయ పార్టీ పెట్టిన సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ విశాఖలో ఒక రోజు దీక్ష చేశారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఏపీ అధికార ప్రతిపక్ష నేతలు సీఎం వైఎస్ జగన్, చంద్రబాబుకు లక్ష్మీనారాయణ కీలక సూచన చేశారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందున ఏపీకి ప్రత్యేక హోదా పొందడానికి ఇది గొప్ప అవకాశమని అన్నారు. వార్షిక ఫైనాన్షియల్ స్టేట్మెంట్ బిల్లు(ఓటాన్ అకౌంట్ బడ్జెట్) ను పార్లమెంట్ లో ఆమోదం పొందకుండా నిలిపివేయాలని సూచించారు.
ఇది చేసి ప్రత్యేక హోదా, విభజన హామీల విషయంలో చిత్తశుద్ది నిరూపించుకోవాలని జై భారత్ నేషనల్ పార్టీ అధినేతగా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. కేంద్రంతో అంటకాగుతున్న జగన్ గానీ, అవకాశం ఇస్తే చంక ఎక్కడానికి సిద్దంగా ఉన్న చంద్రబాబు గానీ జేడీ లక్ష్మీనారాయణ కీలక సూచనను పట్టించుకునే అవకాశం ఉంటుందా అంటే లేదనే చెప్పవచ్చు. చెవిటివాటి ముందు శంఖం ఊదినట్లు జేడీ లక్ష్మీనారాయణ కంఠశోషను ఈ నేతలు పరిగణలోకి తీసుకునే అవకాశమే లేదు.
AP Cabinet: 6,100 పోస్టులతో మెగా డీఎస్సీకి గ్రీన్ సిగ్నల్ .. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవి