TDP: ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రధాన రాజకీయ పక్షాల్లోని నేతల్లో టికెట్ వస్తుందా ..? రాదా..? ఒక వేళ టికెట్ ఇస్తే ఎక్కడ కేటాయిస్తారు ..? అన్న టెన్షన్ పలువురు ఆశావహుల్లో నెలకొని ఉంది. చివరి నిమిషంలో తమకు టికెట్ లేదని హ్యాండ్ ఇస్తే పరిస్థితి ఏమిటి ఆందోళన కొందరిలో ఉంది.
ఓ పక్క అధికార వైసీపీ అభ్యర్ధుల ఎంపికలో ముందంజలో ఉంది. ఇప్పటికే ఇన్ చార్జిల మార్పులు చేర్పులతో అయిదు జాబితాలు విడుదల చేసింది. దాదాపు 60 అసెంబ్లీ స్థానాలు, సుమారు డజను లోక్ సభ స్థానాలకు అభ్యర్ధులను ఖరారు చేసింది. ఇంకా ఆ పార్టీలో అభ్యర్ధుల మార్పులు, చేర్పులపై కసరత్తు కొనసాగుతూనే ఉంది.
వైసీపీలో టికెట్ దక్కని కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యే, ఎంపీలు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ప్రత్యర్ధి పార్టీల్లో చేరుతున్నారు. మరి కొందరు పార్టీ పెద్దలు ఇచ్చిన హామీలతో కొత్త ఇన్ చార్జిలకు సహకరిస్తున్నారు. ఇప్పుడు టీడీపీలోనూ అదే పరిస్థితి కనిపిస్తొంది. చాలా మంది నేతలకు టికెట్లు దక్కవని తెలుస్తొంది. ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాల్లోని టీడీపీ నేతల్లో టెన్షన్ ఎక్కువగా కనబడుతోంది. తమకు టికెట్ వస్తుందా ..! రాదా..పొత్తులో భాగంగా జనసేనకు తమ సీటు ఇచ్చేస్తారా అనే టెన్షన్ ఉంది.
ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు జరుపుతున్నట్లు వార్తలు వినబడుతున్నాయి. సగం లోక్ సభ స్థానాల్లో అభ్యర్ధుల ఎంపిక పూర్తి అయ్యిందనీ, మిగతా లోక్ సభ స్థానాలకు సంబంధించి కసరత్తు కొనసాగుతోందని అంటున్నారు. ఇక అసెంబ్లీ స్థానాలకు సంబంధించి సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుగుతున్నాయని సమాచారం.
జనసేనకు ఎన్ని స్థానాలు కేటాయించాలి.. ? ఏఏ స్థానాలు కేటాయించాలి..? అనే దానిపై చంద్రబాబు సమాలోచనలు జరుపుతున్నారు. త్వరలోనే దీనిపై ప్రకటన చేయనున్నారు. 4,5 తేదీల నుండి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ జిల్లాల పర్యటన చేయనున్న నేపథ్యంలో ఈలోపుగానే పోటీ చేసే స్థానాలపై ఒక అవగాహనకు వస్తే మంచిదనే అభిప్రాయం ఇరు పార్టీల నేతల్లో ఉంది.
పార్టీ క్యాడర్ బలంగా ఉన్న ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన ఎక్కువ స్థానాలు అడుగుతోంది. అయితే తమకు పట్టు ఉన్న స్థానాలను వదులుకోవడానికి చంద్రబాబు సిద్దంగా లేరని అంటున్నారు. పొత్తులో భాగంగా నియోజకవర్గాన్ని వదులుకుంటే క్షేత్ర స్థాయిలో పార్టీ మరింత బలహీనపడుతుందని చంద్రబాబు అనుకుంటున్నారుట.
ఇదిలా ఉండగా.. టీడీపీలో మంచి వాగ్దాటి ఉన్న నేత, మాజీ మంత్రి కొత్తపల్లి శామ్యూల్ జవహర్ టికెట్ ఎక్కడ కేటాయిస్తారో తెలియక అయోమయంలో ఉన్నారు. ఉపాధ్యాయ వృత్తి నుండి రాజకీయాల్లోకి వచ్చిన జవహర్ 2014 ఎన్నికల్లో కొవ్వూరు రిజర్వుడ్ స్థానం నుండి పోటీ చేసి నాటి వైసీపీ అభ్యర్ధిని తానేటి వనితపై గెలిచారు. 2017లో జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తొలి సారిగా ఎన్నికైనా ఎస్సీ కోటాలో మంత్రి అవ్వడంతో స్థానిక నాయకులను నిర్లక్ష్యంగా చేశారని, దీంతో 2019 ఎన్నికల నాటికి స్థానిక నేతలు జవహర్ నాయకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.
బలమైన కమ్మ సామాజికవర్గం నేతలు వ్యతిరేకించడంతో చంద్రబాబు ఆయనను తిరువూరుకు షిప్ట్ చేశారు. తిరువూరులో వైసీపీ అభ్యర్ధి, సిట్టింగ్ ఎమ్మెల్యే రక్షణనిధి చేతిలో పరాజయం పాలైయ్యారు. అయితే రాబోయే ఎన్నికల్లో తిరువూరులో పోటీ చేసేందుకు ఇన్ చార్జిగా దేవదత్తును నియమించిన చంద్రబాబు.. జవహర్ ను రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ చార్జిగా నియమించారు. కొవ్వూరు టికెట్ తనదేనని జవహార్ ప్రచారం చేసుకుంటుంటే .. ఆ నియోజకవర్గంలోని జవహర్ వ్యతిరేక వర్గం ఇటీవల నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. జవహార్ వద్దంటూ ఆ పార్టీ నేతల ముందే ప్లకార్డులు ప్రదర్శించారు.
ఇటు కొవ్వూరులో బలమైన వ్యతిరేక వర్గం, మరో పక్క తిరువూరులో ఇన్ చార్జిని నియమించడంతో అవకాశం లేకపోవడంతో జవహార్ ను చంద్రబాబు ఎక్కడకు పంపుతారు అన్న చర్చ జరుగుతోంది. జిల్లాలో మరో రిజర్వుడ్ నియోజకవర్గమైన గోపాలపురంకు పంపే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్నా ఆ నియోజకవర్గంలో ఇన్ చార్జిగా ఉన్న మద్దిపాటి వెంకట్రాజుతో పాటు మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకట్రావు లు టికెట్ రేసులో ఉన్నారు. దీంతో జవహర్ పరిస్థితి ఏమిటి జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.
Union Budget 2024: ఏపీలో రైల్వే అభివృద్ధికి బడ్జెట్ లో భారీగా నిధులు కేటాయింపు