Union Budget 2024: 2024 – 25 ఆర్ధిక సంవత్సరానికి గానూ కేంద్ర బడ్జెట్ ను ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు సంస్థలకూ కేంద్ర బడ్జెట్ లో కేటాయింపులు ఉంటాయని ముందుగా భావించారు కానీ ఇది మధ్యంతర బడ్జెట్ కావడంతో ఆశించిన మేర కేటాయింపులు లేవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అయితే తాత్కాలిక బడ్జెట్ లో రైల్వే అభివృద్ధికి ఏపీకి రూ.9,138 కోట్లు, తెలంగాణకు రూ.,5,071 కోట్లు కేటాయించినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి రాకముందు 2009 నుండి 2014 వరకూ ఉమ్మడి ఏపీలో రైల్వే అభివృద్ధికి 886 కోట్ల నిధులు ఇవ్వగా, ప్రస్తుత బడ్జెట్ లో ఒక్క ఏపీకే రూ.9,138 కోట్లు కేటాయించామని తెలిపారు.
ఆంధ్రాలో ఏడాదికి 240 కిలో మీటర్ల మేర నూతన ట్రాక్ పనులు జరుగుతున్నాయని చెప్పారు. 98 శాతం లైన్ల విద్యుదీకరణ పనులు పూర్తి అయ్యాయని చెప్పారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటునకు 53 ఎకరాల భూమిని కేటాయించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఇప్పటికే కోరామనీ, అయితే ప్రభుత్వం ఇంకా భూమి అప్పగించలేదని చెప్పారు. జోన్ ఏర్పాటునకు డీపీఆర్ సిద్దమైందని, భూమి ఇస్తే పనులు ప్రారంభించేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపారు.
తెలంగాణలో రైల్వేల కోసం రూ.5,071 కోట్లు కేటాయించినట్లు మంత్రి చెప్పారు. రాష్ట్రంలో వంద శాతం విద్యుదీకరణ పనులు పూర్తి అయ్యాయని తెలిపారు. గత పదేళ్లలో వివిధ చోట్ల 414 ఫ్లైఓవర్లు, అండర్ పాసేజ్ లు నిర్మించినట్లు చెప్పారు. రైల్వేపై రాష్ట్రంలో పెట్టుబడులు గణనీయంగా పెరిగాయని చెప్పారు. ఖాజీపేట కోచ్ ప్యాక్టరీకి ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన విషయాన్ని గుర్తు చేసిన మంత్రి .. పనులు జరుగుతున్నట్లు తెలిపారు.
AP Assembly: ఈ నెల ఐదో తేది నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు