Priyadarshi Pulikonda: ప్రియదర్శి పులికొండను తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన ప్రియదర్శికి చిన్నతనం నుంచి సినిమాలపై విపరీతమైన ఆసక్తి ఉండేది. ఆ ఆసక్తితోనే 2016లో టెర్రర్ అనే మూవీ తో సినీ రంగ ప్రవేశం చేశాడు. ఈ చిత్రంలో టెర్రరిస్ట్ గా నటించాడు. అదే ఏడాది విడుదలైన పెళ్లిచూపులు మూవీలో విజయ్ దేవరకొండ ఫ్రెండ్ గా నటించాడు. ఈ సినిమా ప్రియదర్శికి మంచి గుర్తింపును తీసుకొచ్చింది. అలాగే మరిన్ని అవకాశాలు వచ్చేందుకు తోడ్పడింది.
అలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో ప్రియదర్శి బిజీ ఆర్టిస్ట్ గా మారాడు. తనదైన కామెడీ టైమింగ్ తో భారీ క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్న ప్రియదర్శి.. ఇప్పుడు హీరోగా దూసుకుపోతున్నాడు. 2019లో వచ్చిన మల్లేశం మూవీతో ప్రియదర్శి కథానాయకుడిగా మారాడు. 2023లో వచ్చిన బలగం మూవీతో హీరోగా బ్రేక్ వచ్చింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం భారీ విజాయన్ని అందుకుంది.
డిస్నీ+ హాట్స్టార్ ద్వారా వచ్చిన సేవ్ ది టైగర్ వెబ్ సిరీస్ ప్రియదర్శి గ్రాఫ్ ను అమాంతం పెంచేశాయి. దీంతో ఇప్పుడీ కమెడియన్ పూర్తి స్థాయి హీరోగా మారిపోబోతున్నాడు. ప్రస్తుతం ప్రియదర్శి చేతిలో ఏకంగా మూడు క్రేజీ ప్రాజెక్ట్లు ఉన్నాయి. అందులో డార్లింగ్ ఒకటి. అశ్విన్ రామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో ప్రియదర్శికి జోడిగా నభా నటేష్ నటిస్తోంది. అనన్య నాగళ్ళ, మురళీధర్ గౌడ్, శివ రెడ్డి, కృష్ణ తేజ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. హనుమాన్ మూవీతో బిగ్ హిట్ అందుకున్న నిర్మాత నిరంజన్ రెడ్డి తన ప్రైమ్ షో ఎంటర్ టైనమెంట్ బ్యానర్ పై డార్లింగ్ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు.
అయితే డార్లింగ్ సెట్స్ మీద ఉండగానే ప్రియదర్శి మరో మూవీని అనౌన్స్ చేశాడు. రానా దగ్గుబాటికి చెందిన స్పిరిట్ మీడియా మరియు శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్లపై ఓ రొమాంటిక్ కామెడీ డ్రామా సినిమా చేసేందుకు ప్రియదర్శి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. రీసెంట్ గా ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన కూడా వచ్చింది. సునీల్ నారంగ్ కూతురు, ప్రతిష్టాత్మక టైమ్స్ పవర్ ఉమెన్ 2024 అవార్డును అందుకున్న జాన్వీ నారంగ్ ఈ చిత్రానికి నిర్మాతగా మారింది. నవనీత్ శ్రీరామ్ డైరెక్టర్ గా వ్యవహరించబోతున్నాడు. 2025 జనవరిలో ఈ చిత్రం సెట్స్పైకి వెళ్లనుంది. టెక్నికల్ టీం, తారాగణం వివరాలతో పాటు చిత్రం టైటిల్ త్వరలో రివీల్ చేయనున్నారు.
ఇక ఈ రెండు ప్రాజెక్ట్ లతో పాటు ప్రియదర్శి చేతిలో మరో సినిమా కూడా ఉంది. ప్రముఖ సీనియర్ దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి, ప్రియదర్శి కాంబినేషన్ లో ఓ సినిమా ప్రారంభం అయింది. ఇందులో ప్రియదర్శి, తెలుగమ్మాయి రూప కొడువాయూర్ హీరో హీరోయిన్లు గా నటిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ సంస్థలో ప్రొడక్షన్ నెంబర్. 15 గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని మార్చిలో పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేశారు. వి.కె. నరేష్, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిశోర్, తనికెళ్ళ భరణి, వైవా హర్ష, శివన్నారాయణ, వడ్లమాని శ్రీనివాస్, ప్రదీప్ రుద్ర తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. మొత్తానికి హీరోగా మూడు సినిమాలు చేస్తూ ప్రియదర్శి బిజీ షెడ్యూల్ ను మెయింటైన్ చేస్తున్నాడు. మరి ఈ చిత్రాలు అతనికి ఎలాంటి ఫలితాలు అందిస్తాయో చూడాలి.