TDP Vs Janasena: రాబోయే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా జనసేన – టీడీపీ కలిసి ముందుకు వెళ్లాలని ఆయా పార్టీల అధినేతలు నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. అయితే పలు నియోజకవర్గాల్లో స్థానిక పరిస్థితులు జనసేన – టీడీపీ కలిసి పని చేసేలా లేవు. పొత్తులో భాగంగా టికెట్ త్యాగం చేయడానికి రెండు పార్టీల శ్రేణులు లేకపోవడం ఆయా పార్టీల అధినేతలకు తలనొప్పిలా పరిణమించే పరిస్థితులు నెలకొన్నాయి. గుంటూరు జిల్లా తెనాలిలో తెలుగు తమ్ముళ్లు తిరగబడుతున్నారు.
రెండు పార్టీల పొత్తులు ఇంకా ఖరారు కాకపోయినా పలు నియోజకవర్గాల్లో జనసేన పోటీకి సిద్దమవుతుండటంతో ఆ నియోజకవర్గాల్లోని టీడీపీ గుర్రుగా ఉంది. పొత్తులో భాగంగా సీట్లు ఖరారు కాకముందే తామే పోటీ చేస్తామని ఎలా చెబుతారంటూ ప్రశ్నిస్తున్నారు. ఓ పక్క అదికార వైసీపీ అభ్యర్ధుల ఎంపికలో చాలా ముందజలో ఉంది. ఇప్పటికే మూడు జాబితాల్లో 50 కిపైగా నియోజకవర్గాల్లో ఇన్ చార్జిలను ప్రకటించింది.
తెలుగుదేశం – జనసేన కూటమి మధ్య ఇప్పటి వరకూ సీట్ల సర్దుబాటే జరగలేదు. సీట్ల సర్దుబాటు, అభ్యర్ధుల ప్రకటనపై ఆయ పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇటీవల సమావేశం అయ్యారు. త్వరలో ఉమ్మడిగా తొలి జాబితా విడుదల చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే ఆదిలోనే హంస పాదుగా జనసేన పార్టీ కోరుకునే మొదటి అసెంబ్లీ సీటులోనే ఇరుపార్టీల మధ్య పెద్ద పంచాయతీ నెలకొంది. జనసేన పార్టీలో నెంబర్ -2 పొజిషన్ లో ఉన్న నాదెండ్ల మనోహర్ తెనాలి అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయడానికి సిద్దం అవుతున్నారు.
పొత్తులో భాగంగా అధికారికంగా తెనాలి సీటును ఖరారు చేయకముందే జనసేన అభ్యర్ధిగా మనోహర్ పోటీ చేస్తానని ఎలా ప్రకటన చేస్తారని తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. అయితే తెనాలి టికెట్ ను సీనియర్ టీడీపీ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజాకే కేటాయించాలని ఆ పార్టీ ద్వితీయ స్థాయి నేతలు పట్టుబడుతున్నారు. పొత్తులో భాగంగా తెనాలి సీటు ను జనసేనకు కేటాయిస్తే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. ఒక వేళ జనసేనకు కేటాయిస్తే రెబల్ అభ్యర్ధిగా రాజా పోటీ చేస్తారని అంటున్నారు.
కొందరు నేతలు ఇప్పటికే ఆలపాటి రాజాతో సమావేశమై చర్చించారు. పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూద్దామని, తొందర పడవద్దని పార్టీ నేతలకు ఆలపాటి రాజా సూచించినట్లు తెలుస్తొంది. మరో పక్క ఆలపాటి రాజా పార్టీ నేతలతో ఆత్మీయ సమావేశానికి సిద్దమైయ్యారు. నియోజకవర్గంలో టీడీపీ – జనసేన మధ్య ఉన్న వైరుథ్యం కారణంగా సవ్యంగా ఓటు ట్రాన్సఫర్ అయ్యే పరిస్థితి లేదనే మాట వినబడుతోంది.
తెనాలి నియోజకవర్గంలో నాదెండ్ల మనోహర్, ఆలపాటి రాజా మధ్య దశాబ్దాల కాలంగా రాజకీయ వైరం ఉంది. 2009 నుండి వీరు ప్రత్యర్ధులుగా ఉన్నారు. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు వేమూరు నుండి గెలిచిన ఆలపాటి రాజా టీడీపీ హయాంలో మంత్రిగా పని చేశారు. 2009 ఎన్నికల్లో తెనాలిలో కాంగ్రెస్ అభ్యర్ధిగా నాదెండ్ల మనోహర్ కేవలం 2,800 ఓట్ల మెజార్టీతో ఆలపాటి రాజాపై విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్ధికి 37వేలకు పైగా ఓట్లు వచ్చాయి.
2014 ఎన్నికల్లో ఆలపాటి రాజా వైసీపీ అభ్యర్ధిపై విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో ఆలపాటి రాజా వైసీపీ అభ్యర్ధి శివకుమార్ పై 17,649 ఓట్ల తేడాతో ఓటమి పాలైయ్యారు. జనసేన పార్టీ తరపున పోటీ చేసిన నాదెండ్ల మనోహర్ కు 17వేలకు పైగా ఓట్లు వచ్చాయి. దీన్ని బట్టి చూస్తే నియోజకవర్గంలో జనసేన పార్టీకి సొంతంగా గెలుపునకు అవసరమైన బలం లేకపోయినా అభ్యర్ధుల గెలుపు ఓటములపై ప్రభావం చూపే స్థాయిలో ఓటింగ్ ఉంది అనేది అర్ధం అవుతోంది.
మరో పక్క నియోజకవర్గంలో ఈ పరిస్థితులను వైసీపీ క్యాష్ చేసుకోవాలని భావిస్తొంది. పొత్తులో భాగంగా జనసేనకు ఈ టికెట్ ఇస్తే ఆలపాటి రాజాను పార్టీలోకి ఆహ్వానించాలని వైసీపీ భావిస్తొందట. టీడీపీ నుండి వైసీపీలో చేరిన విజయవాడ ఎంపీ కేశినేని నానికి టికెట్ కన్ఫర్మ్ చేశారు. అలానే తిరువూరు నుండి చేరిన నలగట్ల స్వామిదాసుకు దాదాపు టికెట్ ఖరారు చేసింది వైసీపీ. ఇప్పుడు తెనాలి నుండి సీనియర్ నేత ఆలపాటి రాజా వస్తే కూడా వైసీపీ టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
YS Sharmila: పీసీసీ చీఫ్ గా వైఎస్ షర్మిల .. కీలక ప్రకటన విడుదల చేసిన ఏఐసీసీ