YSRCP: సార్వత్రిక ఎన్నికల దగ్గర పడుతుండటంతో ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు కొనసాగిస్తొంది. పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఇప్పటికే 50కిపైగా నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేశారు. పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలను లోక్ సభ ఇన్ చార్జిలుగా, లోక్ సభ సభ్యులను అసెంబ్లీ ఇన్ చార్జిలుగా నియమించారు.
లోక్ సభ సభ్యులు ఎమ్మెల్యే అభ్యర్ధులుగా వెళ్లడానికి ఇష్టపడుతుండగా, ఎమ్మెల్యేలు మాత్రం లోక్ సభ కు పోటీ చేయడానికి ఇష్టపడటం లేదు. ఎంపీ టికెట్ వద్దు – ఎమ్మెల్యే టికెట్ యే ముద్దు అన్నట్లుగా చెబుతున్నారు. పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేయాలంటే ఆ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని అడు అసెంబ్లీ సిగ్మెంట్ లో డబ్బులు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
నియోజకవర్గానికి పది నుండి 15 వేసుకున్నా మొత్తంగా వంద కోట్ల వరకూ ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇంత నిధులు ఖర్చు చేసినా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల హవానే కొనసాగుతుంది. నేరుగా లోక్ సభ సభ్యుడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే, లేదా మంత్రిని కాదని ఏమీ చేయలేని పరిస్థితి. పారిశ్రామిక వేత్తలు అయితే ఢిల్లీలో లాబీయింగ్ చేసుకోవడానికి ఎంపీ పదవి ఉపయోగించుకోవచ్చు కానీ సాధారణ రాజకీయ నాయకులు మాత్రం లోక్ సభకు వెళ్లడానికి ఇష్టపడటం లేదు.
ఢిల్లీలో నెట్టుకు రావాలంటే హిందీ లేదా ఇంగ్లీషు భాష తప్పకుండా వచ్చి ఉండాలి. ఒక వేళ భాషలు వచ్చినా ప్రతిపక్ష ఎంపీలను పెద్దగా ఢిల్లీలో పట్టించుకోరు. తదితర కారణాల రీత్యా ఎక్కువ మంది లోక్ సభకు పోటీ చేయడానికి వెనకడుగు వేస్తున్నారుట. వైసీపీకి ప్రస్తుతం 22 మంది ఎంపీలు ఉండగా, వారిలో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు మొదటి నుండి పార్టీకి వ్యతిరేకంగానే ఉన్నారు. మిగిలిన 21 మందిలో ఎక్కువ మంది అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయడానికే మొగ్గు చూపుతున్నారు.
ఇప్పటి వరకూ వైసీపీ తొమ్మిది లోక్ సభ స్థానాలకు ఇన్ చార్జిలను నియమించింది పార్టీ. కర్నూలు ఎంపీ స్థానానికి ప్రస్తుతం ఉన్న డాక్టర్ సతీష్ కుమార్ ను పక్కన పెట్టి కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం కు ఇన్ చార్జిగా నియమించారు. జయరాం లోక్ సభకు పోటీ చేయడానికి సుముఖంగా లేరు. తాను ఎంపీగా పోటీ చేయనని సీఎం వద్ద చెబుతున్నారు. అరకు ఎంపీగా ఉన్న గొడ్డేటి మాధవిని ఎమ్మెల్యే స్థానానికి మార్చి ఆమె స్థానంలో ఎమ్మెల్యే కొట్టుగుళ్లు భాగ్యలక్ష్మిని లోక్ సభ అభ్యర్ధిగా ప్రకటించారు. ఇందుకు ఆమె సుముఖంగా లేరని సమాచారం.
తిరుపతి ఎంపీగా ఉన్న డాక్టర్ గురుమూర్తిని సత్యవేడుకు పంపి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న కోనేటి ఆదిమూలంను ఎంపీ అభ్యర్ధిగా ప్రకటించగా, ఆయనా సుముఖత వ్యక్తం చేయడం లేదు. అలానే ఏలూరు లోక్ సభ స్థానానికి ఇన్ చార్జిగా నియమితులైన కారుమూరు సునీల్ కుమార్ యాదవ్, అనంతపురం లోక్ సభ ఇన్ చార్జిగా నియమితులైన మంత్రి శంకర నారాయణ, చిత్తూరు లోక్ సభ అభ్యర్ధి నారాయణ స్వామిలు సుముఖత వ్యక్తం చేయడం లేదని సమాచారం.
మంత్రి విడదల రజినిని నరసరావుపేట లోక్ సభ స్థానానికి, మంత్రి రోజాను ఒంగోలు పార్లమెంట్ స్థానానికి పోటీ చేయాలని పార్టీ నేతలు ప్రతిపాదిస్తే తాము ఎమ్మెల్యేగానే పోటీ చేస్తామని తెలియజేసారుట. విశాఖ లోక్ సభ స్థానానికి మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి జాన్సీని ఎంపిక చేయగా, గతంలో చేసిన అనుభవం, రాజకీయ కుటుంబ నేపథ్యం కారణంగా సుముఖత వ్యక్తం చేసినట్లుగా తెలుస్తొంది. అభ్యర్ధులు వెనకడుగు వేస్తున్న కారణంగా ఇప్పటి వరకూ ప్రకటించిన స్థానాల్లో పలువురి మార్పులు ఉండవచ్చని అంటున్నారు.
Rajya Sabha Elections: రాజ్యసభ ఎన్నికలకు షెడ్యుల్ విడుదల .. పోలింగ్ ఎప్పుడంటే ..?