TDP-YSRCP: ఏపీలో శనివారం ఒక్క రోజు పరిస్థితిని గమనిస్తే.. చెవులు దద్దరిల్లిపోయిన పరిస్థితి కనిపించింది. ఒకవైపు అధికార పార్టీ వైసీపీ, మరోవైపు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, ఇంకో వైపు.. కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలలు భారీ ఎత్తున సభలు నిర్వహించాయి. వైసీపీ అధినేత జగన్, అటు టీడీపీ అదినేత చంద్రబాబు కూడా.. పెద్ద ఎత్తున ఈ సభల్లో విమర్శలు.. ప్రతి విమర్శలు చేసుకున్నారు. ఇక, పార్టీ నేతలతో నిర్వహించిన కార్క్రమాల్లో షర్మిల రెచ్చిపోయారు. ఇక, వచ్చే ఎన్నికలకు ఇది నాంది అన్నట్టుగా మూడు పక్షాలు కూడా.. మైకులు దద్దరిల్లే మాదిరిగా విమర్శలు సంధించుకున్నారు.
ఒకరు రాష్ట్రానికి పట్టిన శని వదులుతుందని అంటే.. మరొకరు.. రాష్ట్రానికి ఉన్న శకుని వదిలిపోతాడని అన్నారు. అటు.. వైపు మాటల తూటాలు పేలితే.. ఇటు వైపు అంతకుమించిన బాంబులే పేలాయి. వయసు ఫ్యాక్టర్ కూడా రాజకీయాల్లోకి వచ్చేసింది. సీఎం జగన్.. చంద్రబాబును 75 ఏళ్ల వృద్ధుడు అని పిలిస్తే.. అదే చంద్రబాబు తనకు వయసుతో సంబంధం లేదని.. ఆలోచనల్లో తాను యువకుడినేనని చెప్పుకొచ్చారు. ఇలా.. ఇరు పక్షాల మధ్య పోటా పోటీ వ్యాఖ్యలు చోటు చేసుకున్నాయి. షర్మిల ఏకంగా.. అన్నపైనా, పార్టీపైనా తీవ్ర విమర్శలు చేశారు.
దీంతో ప్రధాన చానెళ్లో ఎవరి ప్రసంగాలను ప్లే చేయాలో తెలియక.. స్క్రీన్లను రెండు భాగాలుగా విడదీసి ప్రసారం చేశారు. ఇక, ఆయా వర్గాల చానెళ్లు ఎవరికి వారే ఇచ్చుకున్నారు. మరోవైపు..ఎటు చూసినా.. జనాలకు నాయకుల ప్రసంగాలే వినిపించాయి. బయటకు వెళ్లిన.. ఫోన్లు ఆన్ చేసినా.. అంతా ప్రసంగాల పరంపర, పార్టీల పాటలు.. ఇలా అబ్బో అనిపించేలా శనివారం హోరెత్తిపోయింది. అయితే.. కథ ఇక్కడితో అయి పోలేదు. అసలు సిసలు ప్రచారం ముందుందని అంటున్నారు పరిశీలకులు.
స్థార్ కాదు.. ఫైవ్ స్టార్ క్యాంపెయినర్లు.. రాష్ట్రంలోకి అడుగు పెట్టనున్నట్టు తెలుస్తోంది. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి వంటివారు బీజేపీ తరఫున, తెలంగాణ నుంచి కేసీఆర్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఈయన వైసీపీ తరఫున నేరుగా బరిలోకి దిగుతారని చెబుతున్నారు. అదేసమయంలో జనసేన అదినేత పవన్, ఆయన మెగా కుటుంబం ఈ సారి ప్రచారానికి రానుంది. అదేవిధంగా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న విజయమ్మ కుమారుడి పక్షాన మైకు పట్టుకోనున్నారు. టీడీపీ నుంచి నారా ప్యామిలీ, నారా లోకేష్, బ్రాహ్మణి, బాలయ్య.. వంటివారు దిగిపోనున్నారు. ఇక, అప్పుడు చూడాలి సామీ.. ప్రజల చెవుల్లోకి రక్తం కారడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.