జనసేన నాయకుడు కొణిదెల నాగబాబు గత ఎన్నికల్లో తమ సొంత ప్రాంతం అయిన పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురం పార్లమెంటు సీటు నుంచి లోక్సభకు పోటీ చేశారు. తన తమ్ముడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి అసెంబ్లీకి పోటీ చేశారు. నరసాపురం పార్లమెంటు పరిధిలో భీమవరం ఉండడంతో పాటు ఇది తమ సొంత ప్రాంతం కావడంతో నాగబాబు ఇక్కడ నుంచే జనసేన తరఫున ఎంపీగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో జనసేన ఓడిపోయి మూడో స్థానంతో సరిపెట్టుకుంది. అయిన కూడా నాగబాబుకు ఏకంగా 2,50,000 కు పైగా ఓట్లు వచ్చాయి. ఇది చాలా పెద్ద ఓటింగ్ శాతం అని చెప్పుకోవాలి.
జనసేన ఆ స్థాయిలో ఓట్లు చీల్చడంతోనే నరసాపురం పార్లమెంటు సీటును టిడిపి 25వేల ఓట్ల స్వల్ప తేడాతో కోల్పోవాల్సి వచ్చింది. ఏపీలో సాధారణ ఎన్నికల వేడి రాజుకుంది. ఈ క్రమంలోనే జనసేన – టిడిపి మధ్య పొత్తుల చర్చలు జరుగుతున్నాయి. జనసేనకు ఎన్ని స్థానాలు ఇవ్వాలి.. ఏయే పార్లమెంటు సీట్లు ? ఏయే అసెంబ్లీ సీట్లు ఇవ్వాలన్న దానిపై చర్చలు నడుస్తున్నాయి.
ఈ సారి పొత్తు ఉంటే అధికారం పక్కా అన్న ఆశలు అటు టీడీపీ, ఇటు జనసేన వాళ్లకు కూడా గట్టిగానే ఉన్నాయి. ఈ క్రమంలోనే నాగబాబుకు మళ్లీ ఎంపీగా పోటీ చేయాలన్న ఆశలు అయితే కలుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ సారి నాగబాబు కన్ను అనకాపల్లి పార్లమెంటు సీటుపై పడినట్టుగా తెలుస్తోంది. పొత్తులో భాగంగా అనకాపల్లి సీటు నుంచి ఈ సారి జనసేన నేత బైరా దిలీప్ చక్రవర్తి పోటీ చేయాలన్న ప్లానింగ్ నడుస్తోంది. అటు టీడీపీ నుంచి పార్టీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు తనయుడు విజయ్ రేసులో ఉన్నారు.
ఇదిలా ఉండగానే ఇప్పుడు నాగబాబు కూడా ఈ సీటు రేసులో ఉండడం విశేషం. నాగబాబు తనకు ఎక్కడ పోటీ వస్తాడా ? అన్న డౌట్తో ఉన్న చింతకాయల విజయ్ తాజాగా విశాఖ పర్యటనకు వచ్చిన నాగబాబును కలిసి చర్చించారు. ఈ సారి గెలవకపోతే మళ్లీ భవిష్యత్తులో ఎంపీ అయ్యే ఛాన్స్ రాదని డిసైడ్ అయిన నాగబాబు ఈసారి ఎలాగైనా పోటీ చేయాలన్న బలమైన కోరికతో ఉన్నట్టు తెలుస్తోంది.
గతంలో ఇదే అనకాపల్లి సీటు నుంచి ప్రజారాజ్యం తరపున చిరు బావమరిది, నిర్మాత అల్లు అరవింద్ పోటీ చేశారు. ఇక ఇప్పుడు నాగబాబు తన అదృష్టం పరీక్షించుకునేందుకు తహతహలాడుతున్నారు. మరి నాగబాబు టిక్కెట్ ఆశలు ఎంత వరకు నెరవేరతాయో ? చూడాలి.