మంత్రి బొత్స సత్యనారాయణ వైసీపీలోనే కాదు.. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో సీనియర్ నేత.. దాదాపు మూడు దశాబ్దాలుగా ఆయన చట్టసభల్లో తన గళం వినిపిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం విజయనగరం జిల్లా వైసీపీ రాజకీయం అంతా బొత్స ఇంట్లోనే ఉంది. బొత్స కుటుంబానికే చెందిన వాళ్లు ఏకంగా ఐదారుగురు కీలక ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. ఈ సారి బొత్స కుటుంబానికి జగన్ మరింత బంపర్ ఆఫర్లు ఇచ్చేస్తున్నారు. చీపురుపల్లి, నెల్లిమర్ల, గజపతినగరం, ఎస్.కోట ఈ నాలుగు అసెంబ్లీ సీట్లతో పాటు విజయనగరం పార్లమెంటు సీటు కూడా బొత్స ఫ్యామిలీ చేతుల్లోనే ఉంది.
అయితే ఈ సారి పై సీట్లతో పాటు బొత్స కుటుంబానికి విశాఖ జిల్లా నుంచి రెండు సీట్లు బోనస్గా వస్తున్నాయి. బొత్స భార్య విజయనగరం మాజీ ఎంపీ ఝాన్సీని జగన్ ఈ సారి విశాఖ పార్లమెంటు బరిలో దింపారు. వచ్చే ఎన్నికల్లో ఆమె విశాఖ నుంచి పార్లమెంటుకు పోటీ చేస్తున్నారు. విజయనగరం పార్లమెంటు సీటు నుంచి బొత్స మేనల్లుడు పోటీ చేస్తారు. తాను ఖాళీ చేసే చీపురుపల్లి సీటును ప్రస్తుత విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్కు ఇస్తారంటున్నారు. చంద్రశేఖర్ కూడా బొత్సకు సమీప బంధువే.
ఇక ఝాన్సీ విశాఖ పార్లమెంటు బరిలో ఉంటే.. బొత్స కూడా భీమిలికి షిఫ్ట్ అవుతున్నారట. విశాఖ పార్లమెంటు పరిధిలోనే భీమిలి కూడా ఉంది. బొత్స భీమిలిలో పోటీ చేస్తే ఇద్దరికి ప్లస్ అవుతుందంటున్నారు. అయితే భీమిలి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఇదే ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన అవంతి శ్రీనివాస్ ఉన్నారు. ఆయన మరోసారి ఇక్కడ నుంచే పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. భీమిలిలోనే జరిగిన జగన్ సిద్ధం సభను ఓ రేంజ్లో సక్సెస్ చేయడంలో అవంతికి మంచి మార్కులే పడ్డాయి.
అయితే ఇప్పుడు తన సీటుకు బొత్స ఎర్త్ పెట్టే పని మొదలు పెట్టడంతో అవంతిలో టెన్షన్ మొదలు కావడంతో పాటు భీమిలి సీటు తన నుంచి చేజారకుండా చూసుకునే ప్రయత్నాలు మొదలు పెట్టేశారట. ఇక భీమిలిలో కాపు ఓటింగ్, మత్సకార ఓటింగ్ బాగా ఎక్కువ. బొత్స తూర్పు కాపు… ఇక అవంతి శ్రీను కాపు క్యాస్ట్. మరి జగన్ ఈ ఈక్వేషన్లలో ఎవరి వైపు మొగ్గు చూపుతారో ? చూడాలి. ఇక భీమిలిలో టీడీపీ తరపున మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తారని అంటున్నారు. అలాగే జనసేన కూడా ఈ సీటు అడుగుతోంది. పొత్తులో టీడీపీ పోటీ చేస్తుందా ? జనసేన పోటీలో ఉంటుందా ? అన్నది అయితే క్లారిటీ లేదు.