Cotton Candy: పీచు మిఠాయిని చిన్నారులు బాగా ఇష్టపడుతూ ఉంటారు. పీచు మిఠాయి చాలా తియ్యగా ఉండటంతో పాటు నోటిలో పెట్టుకోవడంతో వెంటనే కరిగిపోతుంది. రంగురంగుల్లో కనబడటం, టేస్టీ గా ఉండటంతో చిన్నారులు అమితంగా ఇష్టపడుతుంటారు. అనేక రాష్ట్రాల్లో అమ్మకాలు బాగానే జరుగుతూ ఉంటాయి. జాతరలు, ఉత్సవాల్లో వీటి అమ్మకాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అయితే తమిళనాడు ప్రభుత్వం ఇటీవల పీచు మిఠాయి అమ్మకాలను నిషేదించింది.
పీచు మిఠాయి తమిళనాడులో విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. పీచు మిఠాయిని కాటన్ క్యాండీగా పిలుస్తారు. అయితే ఇందులో క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నట్లు పరిశోధనల్లో వెల్లడి కావడంతో తమిళనాడు ప్రభుత్వం దీనిపై నిషేద నిర్ణయం తీసుకుంది. ఇటీవల కాలంలో చెన్నైలోని అనేక ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టిన ఫుడ్ సేఫ్టీ అధికారులు వాటి నాణ్యతను పరిశీలించారు. పీచు మిఠాయిలో రోడమైన్ బీ అనే కెమికల్ ఉన్నట్లు గుర్తించారు. కృత్రిమ రంగుల కోసం ఈ కెమికల్ ను వినియోగిస్తున్నట్లు తేల్చారు. ఈ కెమికల్ క్యాన్సర్ కారకంగా అధికారులు గుర్తించారు.
తమిళనాడుకు ముందు పుదుచ్చేరిలోనూ కాటన్ క్యాండీ అమ్మకాలను నిషేదించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. పీచు మిఠాయి నాణ్యతను పరిశీలించేందుకు అన్ని జిల్లాల నుండి శాంపిల్స్ సేకరించి పంపాలని జిల్లా అధికారులను ఆదేశించింది. ఇలా సేకరించిన నమూనాలను టెస్టింగ్ కు పంపాలని నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఏపీ హెల్త్ అండ్ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ నివాస్ వెల్లడించారు. జిల్లాల నుండి పీచు మిఠాయి శాంపిల్స్ రాగానే ఈ వారంలోనే పరీక్షల కోసం ల్యాబ్ కు పంపనున్నట్లు ఆయన తెలిపారు.
టెస్ట్ ల్లో వచ్చిన ఫలితాల ఆధారంగా నిషేదం విధించాలా వద్దా అనే దానిదానిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కాటన్ క్యాండీల తయారీలో ఉపయోగించే సింథటిక్, నాన్ పర్మిటెడ్ రంగులు క్యాన్సర్ కారకమని, అలానే ఎలాంటి రంగు లేకుండా చేసిన పీచు మిఠాయిలు కూడా అపరిశుభ్రమైన పరిస్థితుల్లో తయారు చేసినందున సురక్షితం కాదని అన్నారు. అయితే అన్ని ప్రాంతాల నుండి పీచు మిఠాయి శాంపిల్స్ సేకరించి పరీక్షించేందుకు సుమారు నెల రోజుల సమయం పడుతుందని ఆయన వెల్లడించారు.
తమిళనాడు, పుదుచ్ఛేరి లో కాటన్ క్యాండీ పై నిషేదం విధించిన నేపథ్యంలో ఇప్పటికే కొంత మంది వ్యాపారులు వీటి విక్రయాలను స్వచ్చందంగా నిలిపివేసినట్లు ఏపీ అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి పండుగలు, జాతర సమయాల్లో వీటి విక్రయాలపై పరిమితులు విధించినట్లు చెప్పారు. తల్లిదండ్రులు పిల్లల విషయంలో జాగ్రత్తలు వహించాలని, పాఠశాలల వద్ద పిల్లలు ఏది పడితే అది తినకుండా చూడాలని సూచిస్తున్నారు.
Supreme Court: సుప్రీం కోర్టులో బీజేపీకి బిగ్ షాక్ .. చండీగఢ్ మేయర్ ఎన్నికపై సంచలన తీర్పు