Supreme Court: చండీగఢ్ మేయర్ ఎన్నిక ఫలితాలపై బీజేపీకి సుప్రీం కోర్టులో బిగ్ షాక్ తగిలింది. చండీగఢ్ మేయర్ ఎన్నిక ఫలితాలపై సుప్రీం కోర్టు మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. ఆప్ అభ్యర్ధిని విజేతగా ప్రకటిస్తూ తీర్పు ఇచ్చింది. రిటర్నింగ్ అధికారి బ్యాలెట్ పత్రాలను తారుమారు చేసేందుకు ఉద్దేశపూర్వకంగా వ్యవహరించారని స్పష్టంగా తెలుస్తొందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
చండీగఢ్ మేయర్ గా బీజేపీ అభ్యర్ధి మనోజ్ కుమార్ సోంకర్ ఎన్నికను సుప్రీం కోర్టు రద్దు చేసింది. గత నెల 30న జరిగిన చండీగఢ్ మేయర్ ఎన్నిక ఓటింగ్ కు సంబంధించిన బ్యాలెట్ పేపర్లను తమకు సమర్పించాలని సోమవారం సుప్రీం కోర్టు ప్రధాన నాయమూర్తి డీవై చంద్రడూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. తిరిగి ఎన్నికలు నిర్వహించడానికి బదులు, బ్యాలెట్ పేపర్ లు తిరిగి లెక్కించాలని ధర్మాసనం నిర్ణయించింది. ఈ మేరకు చేపట్టిన రీ కౌంటింగ్ లో ఆప్ అభ్యర్ధికి అనుకూలంగా ఓట్లు వచ్చాయని సుప్రీం కోర్టు గుర్తించింది.
సోమవారం నాటి విచారణలో రిటర్నింగ్ అధికారి అనిల్ మసిహ్ కు ధర్మాసనం పలు ప్రశ్నలు వేసింది. మంగళవారం జరిగే విచారణలో బ్యాలెట్ పేపర్లన్నంటినీ తమ ముందు ఉంచాలని చెప్పింది. బ్యాలెట్ పేపర్ పై క్రాస్ మార్క్ తానే పెట్టినట్లు అనిల్ మసిహ్ కోర్టు ముందు ఒప్పుకున్నారు. చండీగఢ్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ గా అమ్ ఆద్మీ పార్టీ కౌన్సిలర్ కుల్దీప్ కుమార్ ను సుప్రీం కోర్టు ప్రకటించింది.
ఆప్ అభ్యర్ధికి వచ్చిన ఎనిమిది ఓట్లను ట్యాంపర్ చేశారన్న ఆరోపణలపై మేయర్ ఎన్నికలు నిర్వహించిన రిటర్నింగ్ అధికారి అనిల్ మసిహ్ కు సుప్రీం కోర్టు షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఎన్నికలనే ప్రజాస్వామ్య ప్రక్రియను కుట్రలు, కుతంత్రాలకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత ఆర్టికల్ 142 కింద తమపై ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. రిటర్నింగ్ అధికారి చెల్లని ఓట్లుగా ప్రకటించిన ఎనిమిది ఓట్లు ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్ధి కుల్దీప్ కుమార్ కు అనుకూలంగా వచ్చాయని ధర్మాసనం తెలిపింది. సుప్రీం కోర్టు తీర్పు పట్ల ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హర్షం వ్యక్తం చేశారు.
CM YS Jagan: వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా నిధులు విడుదల చేసిన సీఎం జగన్