ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు.. తాజాగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గో ఎహెడ్ అన్నట్టుగా పూర్తిస్థాయి స్వేచ్ఛను ఇచ్చేసింది. శనివారం రాత్రి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ.. ఈ మేరకు షర్మిలకు పూర్తిస్థాయి అధికారాలు కట్టబెట్టారు. మేమున్నాం.. నీఇష్టం అంటూ..ఆయన ట్వీట్ చేయడం సంచల నంగా మారింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అసలు లేదనుకున్న పరిస్థితి నుంచి నేడు రాజకీయంగా ఆ పార్టీ విషయంపై ఏపీలో చర్చ సాగుతోంది. దీనికి కారణం ఫైర్ బ్రాండ్గా షర్మిల దూకుడేనని పార్టీ భావిస్తోంది.
అయితే.. ఇదేసమయంలో షర్మిలను నైతికంగా బద్నాం చేస్తున్నారని, కొందరు సోషల్ మీడియాలో తీవ్రవ్యాఖ్యలతో విమర్శలు చేస్తున్నారని.. పార్టీ అధిష్టానానికి సీనియర్లు రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు వంటివారు లిఖిత పూర్వక ఆధారాలతో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో సీరియస్గానే స్పందించిన రాహుల్ గాంధీ మేమున్నాం.. నీకేం కాదు.. అంతా మేం చూసుకుంటాం.. అంటూ.. షర్మిలకు భరోసా ఇచ్చారు. పార్టీ పరంగా దూకుడు నిర్ణయాలు తీసుకోవాలని కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టు తెలిసింది.
గతంలో తెలంగాణలో అధికారంలోకి రావడం కోసం.. కాంగ్రెస్ ఇలానే వ్యవహరించింది. అక్కడి.. పీసీసీ చీఫ్, ప్రస్తుతముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా.. ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. ఎవరిని ఉంచినా, ఎవరిని తుంచినా అడగబోమని రాహుల్ గాంధీ దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలోనే తెలంగాణలో కొందరిని పక్కన పెట్టారు. మరికొందరిని ఇంటికి వెళ్లి మరీ పార్టీలో యాక్టివ్ చేశారు. ఇక, ప్రత్యర్థి పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇప్పుడు ఇంతకు మించి అన్నట్టుగా షర్మిలకు ఏపీలో ఫ్రీ హ్యాండ్ ఇచ్చారని అంటున్నారు.
ముఖ్యంగా వైసీపీ కి చెందిన కొందరు కార్యకర్తలు షర్మిలపై తీవ్ర విమర్శలు, వ్యాఖ్యలు చేస్తూ.. సోషల్ మీడియాలో కామెంట్లు పోస్టు చేసిన విసయంపై రాహుల్ గాంధీ స్పందించారు. ఇలాంటి వాటిని ఉపేక్షించడానికి వీల్లేదని.. అవసరమైన పక్షంలో క్రిమినల్ కేసులు నమోదు చేసి, కోర్టులలో కేసులు వేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా దూకుడు పెంచాలని కూడా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆర్థికంగా, టిక్నికల్ పరంగా తమ సపోర్టు పెరుగుతుందని ధీమా ఇచ్చినట్టు ఢిల్లీ వర్గాలు తెలిపాయి.ఇ దే విషయాన్ని రాహుల్ గాంధీ తన ట్విట్టర్లోనూ పేర్కొనడం గమనార్హం.