టీడీపీ నుండి కన్నా రూ. 20 కోట్లు తీసుకున్నాడు. సుజనాచౌదరి మధ్యవర్తిత్వం వహించాడు : విజయసాయిరెడ్డి ఆరోపణ
వైసిపి లాగా కుల, అవినీతి రాజకీయాలు బీజేపీ చేయదు, నాపై ఆరోపణలు నిజమని విజయసాయిరెడ్డి కాణిపాకం దేవాలయంలో ప్రమాణం చేయాలి : కన్నా సమాధానం
ఇదండీ. వైసీపీలో విజయసాయిరెడ్డి ఎంతటి కీలకమో చెప్పా పనేం లేదు. ప్రభుత్వమూ తనదే, పార్టీ కూడా తనదే అన్నట్టుగా రకరకాల వ్యాఖ్యలు చేస్తుంటారు. ఎప్పుడు, ఏది మాట్లాడతారో… ఎప్పుడు ఏ ట్వీట్ పెడుతుంటారో… బహుశా మర్చిపోతారేమో అందుకే ఆయన ట్వీట్లు ఈ మధ్య కామెడీ పీసులుగా మిగులుతున్నాయి. ఇక కన్నా, విజయసాయి మధ్య పోరుకి వస్తే… మొదటి నుండి విజయసాయి కన్నా, పవన్ కళ్యాణ్ , చంద్రబాబు ఇలా ఏ ఒక్కరినీ వదలరు. తాజాగా కన్నాపై చేసిన ఆరోపణ రాజకీయ వర్గాల్లో, మరీ ముఖ్యంగా బీజేపీలో కలకలం సృష్టించింది. ఒకరకంగా రాజకీయాలను వేడెక్కించింది. “వైసీపీపై విమర్శలు చేయడానికి కన్నా టీడీపీ నుండి కన్నా రూ. 20 కోట్లు తీసుకున్నారని, బీజేపీ నేత సుజనా చౌదరి మధ్య ఉండి ఈ నగదుని ఇప్పించారని పెద్ద బాంబు వేశారు. కన్నాపై నేరుగా బాణం వేశారు.
గతం “కన్నా” వేడి…!
ఇక వైసీపీపై ఇది వరకు సాదాసీదాగా ఆరోపణలు, విమర్శలు చేస్తున్న కన్నా లక్ష్మీనారాయణ ఈరోజు వేడితో మాట్లాడారు. తానునగదు తీసుకున్నట్టు విజయసాయిరెడ్డి కాణిపాకం ఆలయంలో ప్రమాణం చేయాలని కోరారు. వారం, వారం కోర్టులకు వెళ్లి ప్రమాణం చేయడం అలవాటే అంటూ చురకలు వేశారు. అంతే కాదు వైసిపిని కులం, అవినీతి పార్టీ అని, కరోనా వెళ్లిన తర్వాత మీ సంగతి చూస్తా అంటూ స్వరం పెంచారు. పోనీలే కరోనా ఉంది కదా అని సైలెంట్ గా ఉంటె మీరు రాజకీయాలు చేస్తున్నారని, ఇది ముగిసిన వెంటనే మేము రాజకీయాలు మొదలు పెడతామని అన్నారు.
ఇక ముదిరినట్టేనా…!
ఇన్నాళ్లు రాజకీయం ఒకలా ఉంటె ఇక మరోలా మారుతుంది. వైసిపిని ఓ వైపు చంద్రబాబు, టీడీపీ… మరోవైపు జనసేన, పవన్ కళ్యాణ్… ఇంకోవైపు బీజేపీ నాయకులూ మధ్యలో వామపక్షాలు విమర్శలు, ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. విపక్షాలన్నీ ఏకమైనా జగన్ బృందాన్ని ఏకిపారేస్తున్నాయి. వీటిని జగన్ పెద్దగా పట్టించుకోకపోయినా విజయసాయిరెడ్డి, అంబటి రాంబాబు, కొడాలి నాని, ఆమంచి కృష్ణమోహన్ వంటి నాయకులు తరచూ తిప్పికొడుతున్నారు. కానీ కరోనా తర్వాత చూస్తామంటూ కన్నా హెచ్చరించడం కాక పెంచింది. ఎంత కాక పెంచినా కన్నా వెనుక బీజేపీ పెద్దలు ఉంటె కాక రగులుతుంది, లేకపోతే తుస్సుమంటుంది… చూడడమే మన పని.