(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
కరోనా పరీక్షల కోసం వినియోగిస్తున్న ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల కొనుగోలు ధరలపై చెలరేగిన దుమారం మరువక ముందే వాటి ఫలితాల ఖచ్చితత్వంపైనే అనుమానాలు తెరలేస్తున్నాయి.
ఛత్తీస్గఢ్ ప్రభుత్వం రాపిడ్ టెస్టింగ్ కిట్లను రూ.337లకే కొనుగోలు చేసిందని బహిర్గతం కావడంతో…ఎపిలోని ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, బీజేపీలు అధికార పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. దీనిపై మంత్రులే కాకుండా ఏకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా వివరణ ఇచ్చారు. రూ.730ల చొప్పున ప్రస్తుతం కొనుగోలు చేసినప్పటికీ భారత దేశంలో ఏ రాష్ట్రానికి ఇంత కంటే తక్కువ ధరకు విక్రయిస్తే ఆ ధరనే చెల్లించే విధంగా ఒప్పందం జరిగిందని, ఈ ఒప్పందం ఆధారంగా చెల్లింపులు ఉంటాయని వివరణ ఇచ్చారు.
ఇది ఇలా ఉండగా…రాపిడ్ టెస్టింగ్ కిట్ లతో చేస్తున్న పరీక్ష ఫలితాలపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా వైరస్ను నిర్ధారించడానికి ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్తో చేస్తున్న పరీక్ష ఫలితాల్లో కచ్చితత్వం లోపిస్తోందని రాజస్థాన్ ప్రభుత్వం మంగళవారం పేర్కొంది. ఈ సమస్యను భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) దృష్టికి తీసుకెళ్లామని తెలిపింది. ఫలితాల్లో 90 శాతం కచ్చితత్వం వస్తుందని అంచనా వేస్తే.. కేవలం 5.4 శాతం వస్తోందని, వాటి వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రఘు శర్మ పేర్కొన్నారు. సలహా కమిటీ సూచనల మేరకు ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ను వినియోగించడాన్ని అక్కడ నిలిపివేశారు. ఐసీఎంఆర్ స్పందన కోసం ఆ రాష్ట్రం ఎదురుచూస్తున్నది. పీసీఆర్తో నిర్వహించిన పరీక్షల్లో కరోనా సోకిందని తేలిన వారికి ర్యాపిడ్ కిట్స్తో పరీక్షలు నిర్వహిస్తే ఫలితాల్లో నెగిటివ్ అని రావడం వాటి ఫలితాలపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఐసీఎంఆర్ నుంచి వచ్చే స్పందనకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని, అవసరమైతే కిట్స్ను తిరిగి వెనక్కి పంపిస్తామని మంత్రి వెల్లడించారు.
ఈ నేపథ్యంలోనే ఐసిఎంఆర్ స్పందించింది. దేశ వ్యాప్తంగా కరోనా పరీక్షల కోసం వినియోగిస్తున్న ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ వినియోగాన్ని రెండు రోజుల పాటు ఆపేయాలని ఐసీఎంఆర్ సూచించింది. ఈ కిట్స్పై కొన్ని సందేహాలు ఉన్న నేపథ్యంలో దీనిపై రెండు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేస్తామని ప్రకటించింది.
ర్యాపిడ్ టెస్టులో నమూనాగా వేలి నుంచి రక్తం తీసి పరీక్షలు నిర్వహిస్తారు. దీని ద్వారా వైరస్ సోకిన ఆనవాళ్లు ఉన్నాయని వేగంగా గుర్తిస్తారు. అయితే ఈ టెస్టుతో కరోనా వైరస్ సోకిందని నిర్ధారణకు రాలేరు. పీసీఆర్ టెస్టులో మాత్రమే కరోనా సోకిందని నిర్ధారణ అవుతుంది.