నరసాపురం, మార్చి 24: టిడిపికి రాజీనామా చేసిన పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు కొత్తపల్లి సుబ్బారాయుడు వైసిపిలో చేరారు. వైసిపి అధినేత జగన్మోహనరెడ్డి సమక్షంలో ఆదివారం ఆయన పార్టీలో చేరగా పార్టీ కండువా కప్పిసాదరంగా ఆహ్వానించారు.
నరసాపురం అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయాలని భావించిన సుబ్బారాయుడికి టిడిపి అధిష్టానం టికెట్ ఖరారు చేయకపోవడంతో ఐదు రోజుల క్రితం కాపు కార్పోరేషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు.
అనుచరులు, సన్నిహితులతో నర్సాపురంలో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించి వైసిపిలో చేరాలని నిర్ణయించుకున్నారు. తొలుత కార్యకర్తలు ఆయన్ను జనసేనలో చేరాలని ఒత్తిడి చేసినట్లు తెలిసింది.
కొత్తపల్లి 1994, 1999, 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009లో పిఆర్పి నుండి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి ముదునూరి ప్రసాదరావు చేతిలో పరాజయం పాలయ్యారు. తరువాత 2014లో వైసిపి నుండి పోటీ చేసి టిడిపి అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. తరువాత టిడిపిలో చేరగా కాపు కార్పోరేషన్ చైర్మన్ పదవి అప్పగించారు. నేడు తిరిగి వైసిపి గూటికి చేరారు.