మెగాస్టార్ చిరంజీవి ఇంటి నుంచి వచ్చిన హీరోలు ఇండియన్ క్రికెట్ టీమ్ అంత ఉంటారని ప్రేక్షకుల్లోనూ, ఇండస్ట్రీలోనూ ఓ టాక్ ఉంది. చిరంజీవి ఫ్యానిజం.. ఆయన అప్రతిహతమైన క్రేజ్ ఇంత మంది ఫ్యామిలీ హీరోలను ప్రేక్షకులు ఆదరించడానికి కారణమైంది. చిరంజీవి ఫ్యాన్స్ కూడా పవన్ కల్యాణ్ నుంచి కల్యాణ్ దేవ్ వరకూ అందరినీ ఆదరిస్తూ వారికంటూ ఓ క్రేజ్ వచ్చేలా చేశారు. ఇందులో ఎంమాత్రం అతిశయోక్తి లేదు. ఈ లిస్టులో కొణిదెల ఇంటి మరో వారసుడు, నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ కూడా ఉన్నాడు. తనకంటూ ఓ స్పెషల్ ప్లేస్ క్రియేట్ చేసుకుని సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం ఓ డిఫరెంట్ రోల్ ను వరుణ్ తేజ్ యాక్సెప్ట్ చేశాడని తెలుస్తోంది.
మెగా హీరోలందరూ టచ్ చేసిన పోలీస్ పాత్రలో ఇప్పుడు వరుణ్ తేజ్ నటించబోతున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్ ఫిలిం సర్కిల్స్ లో హల్ చల్ చేస్తోంది. దర్శకుడు సాగర్ చంద్ర దర్శకత్వంలో వరుణ్ ఓ సినిమా చేయబోతున్నాడని రీసెంట్ గా ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. 2016లో విష్ణు, నారా రోహిత్ హీరోలుగా వచ్చిన ‘అపట్లో ఒకడుండేవాడు’ సినిమాకు దర్శకత్వం వహించాడు సాగర్ చంద్ర. డిఫరెంట్ పోలిస్ సబ్జెక్ట్ తో వరుణ్ ను సాగర్ చంద్ర మెప్పించాడని అంటున్నారు. దీనికి వరుణ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని అంటున్నారు.
పలు హిట్ సినిమాలు నిర్మించిన అగ్ర నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోందని కూడా అంటున్నారు. ప్రస్తుతానికి గాసిప్స్ గా ఉన్న ఈ వార్తలపై అఫిషియల్ కన్పర్మేషన్ రావాల్సి ఉంది. ఇదే నిజమైతే పోలీస్ పాత్రల్లో రఫ్ఫాడించిన మెగా హీరోల సరసన వరుణ్ తేజ్ కూడా నిలవబోతున్నాడని చెప్పాలి. గత ఏడాది గద్దలకొండ గణేశ్ సినిమాలో సక్సెస్ లో ఉన్న వరుణ్ ప్రస్తుతం బాక్సింగ్ నేపథ్యంలో ఓ సినిమా చేస్తున్నాడు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఈ సినిమాను అల్లు బాబీ, సందీప్ ముద్దా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విశాఖపట్నంలో ఒక షెడ్యూల్ కూడా పూర్తైంది. కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది.