కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న అనేక పథకాలను పొందాలంటే ప్రతి ఒక్కరికీ ఆధార్ తప్పనిసరిగా ఉందాల్సిందేనన్న విషయం అందరికీ తెలిసిందే. వీటికే కాక బ్యాంకింగ్ లావాదేవీలకు, పాన్ కార్డుకు, ఇతర పనులకు కూడా ఆధార్ను తప్పనిసరి చేశారు. అయితే ఇందుకుగాను ఆధార్ను ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉంచుకోవడం అనివార్యమైంది. ఈ క్రమంలో చాలా మంది ఎప్పటికప్పుడు ఆధార్ లో మార్పులు, చేర్పులు చేయించుకుంటుంటారు. అయితే ఇకపై ఆ మార్పులకు గాను రూ.100 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు UIDAI తాజాగా ట్వీట్ చేసింది.
ఆధార్లో ఇకపై మార్పులు చేయించుకోవాలనుకుంటే రూ.100 ఫీజు చెల్లించాలి. అదే కేవలం డెమొగ్రాఫిక్ వివరాలు అప్ డేట్ చేయిస్తే రూ.50 ఫీజు ఇవ్వాలి. ఇతర ఏ వివరాలను అయినా సరే మారిస్తే రూ.100 ఫీజును ఆధార్ సేవా కేంద్రాల్లో చెల్లించాలి. ఇక ప్రజలు తమ పేరు, చిరునామా, పుట్టిన తేదీ తదితర వివరాలను మారిస్తే అందుకు డాక్యుమెంట్లు అవసరం అవుతాయి. UIDAI ప్రస్తుతం 32 రకాల డాక్యుమెంట్లను ఐడీ ప్రూఫ్ కింద తీసుకుంటోంది. అలాగే 45 రకాల డాక్యుమెంట్లను అడ్రస్ ప్రూఫ్ కింద, 15 రకాల డాక్యుమెంట్లను పుట్టిన తేదీ ప్రూఫ్ కింద స్వీకరిస్తోంది. వాటిని సమర్పించి ఆయా వివరాలను ఆధార్లో మార్చుకోవచ్చు.
#AadhaarUpdateChecklist
Whether you update one field or many, charges for the #AadhaarUpdate will be Rs. 100 (if you are also updating biometrics) and Rs. 50 (if only demographics details are being updated). List of acceptable documents: https://t.co/BeqUA07J2b pic.twitter.com/6YlYPJFN6L— Aadhaar (@UIDAI) August 27, 2020
ఇక ఫొటో, బయోమెట్రిక్స్, లింగం, మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ వివరాలను మార్చేందుకు ఎలాంటి ప్రూఫ్లు అవసరం లేదు. పలు ఆధార్ సేవా కేంద్రాల్లో ముందుగానే అపాయింట్మెంట్ను బుక్ చేసుకునే సదుపాయం కల్పిస్తున్నారు. అందువల్ల అపాయింట్మెంట్ బుక్ చేసుకుని టైముకు వెళ్లి ఆధార్ లో ఆయా వివరాలను మార్చుకోవచ్చు. అయితే ఆధార్లో పేరును కేవలం 2 సార్లు మాత్రమే మార్చుకోవచ్చు. అలాగే పుట్టిన తేదీ, లింగంలను ఒక్కసారి మాత్రమే మార్చుకునేందుకు వీలు కల్పించారు.