చీరాల నియోజకవర్గం కటారిపాలెం, వాడరేవు మత్స్యకారుల వలల వినియోగంపై ఇటీవల ఘర్షణ జరగడం దాదాపు 12 మంది గాయపడటం తెలిసిందే. బల్లవల, ఐల వల విషయంలో రెండు గ్రామాల మధ్య గొడవలు జరిగాయి. రెండు గ్రామాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణ ఇటీవల వైసీపీ నియోజకవర్గ ఇన్ చార్జి, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, ఎమ్మెల్యే కరణం బలరాంలతో కలిసి ఆ ప్రాంతాల్లో పర్యటించి సయోధ్య కుదిర్చేందుకు చర్చలు జరిపినా అవి విఫలం అయ్యాయి. రెండు గ్రామాలకు చెందిన మత్స్య కారులు ఏకాభిప్రాయానికి రాలేదు. వివాదం అంతే కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో ఇటీవల మంత్రి సిదిరి అప్పలరాజు తాను వెళ్లి రెండు వర్గాల మధ్య వివాద పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. వలల వివాదం చాలా చోట్ల ఉందనీ, దీనిపై మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కూడా ఫోన్ లో మాట్లాడారని మంత్రి తెలిపారు,. మంత్రి అప్పలరాజు ఇచ్చిన హామీ మేరకు సోమవారం రెండు వర్గాలతో చర్చించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు కారంచేడు మత్స్య అభివృద్ధి అధికారి పత్రికా ప్రకటన విడుదల చేశారు. వాడరేవు, కటారిపాలెం మత్స్యకారుల మద్య బల్ల వల, ఐలవల వినియోగంపై ఏర్పడిన వివాదాలపై చర్చించేందుకు మంత్రి అప్పలరాజు సోమవారం మధ్యాహ్నం రెెండు గంటలకు ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వాడరేవు గ్రామం నుండి అయిదుగురు, కటారిపాలెం నుండి అయిదుగురు చొప్పున ప్రతినిధులు తమ అధార్ కార్డులు, రేషన్ కార్డులతో హజరుకావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.